గద్వాల క్రైం: శాంతిభద్రతల విషయంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటూ.. అనుమానాస్పద కేసుల విచారణ వేగంగా చేపట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడ్ఫ్రైడే, హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా పెట్రోలింగ్, గస్తీని ముమ్మరం చేయాలన్నారు. వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులు, సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటుచేయాలని సిబ్బందిని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసులపై ప్రత్యేకంగా విచారణ చేపట్టాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం రవాణాతో పాటు నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి, పేకాట వంటి వాటిని కట్టడి చేయాలన్నారు. సరిహద్దు ప్రాంతంలో పటిష్ట నిఘా ఉంచాలని తెలిపారు. స్టేషన్లో నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి.. నేరస్తులకు శిక్ష పడేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో అల్లర్లకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్, సీఐలు టాటాబాబు, శ్రీను, ప్రదీప్కుమార్, ఎస్ఐలు, శ్రీకాంత్, శేఖర్, శ్రీహరి, నందికర్ తదితరులు ఉన్నారు.


