
రజతోత్సవ సభకు తరలిన నేతలు
అలంపూర్: వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నియోజకవర్గంలోని నేతలు భారీగా తరలి వెళ్లారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు కానున్న సందర్భాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత నేతృత్వంలో సభ జరగనుండటంతో ఈ ప్రాంతం నుంచి పార్టీ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. అలంపూర్ పట్టణంలోని బ్రహ్మాణ వీధిలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకట్రామయ్యశెట్టి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు ఆదేశాలతో మండలంలోని నేతలు చలో వరంగల్ సభకు తరలివెళ్తున్నట్లు తెలిపారు. 25 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో సాధించిన విజయాలను వివరించారు. నియోజకవర్గంలోని బీచుపల్లిలో ఎమ్మెల్యే విజయుడు జెండా ఊపి కాన్వాయిని ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు బుక్కాపురం శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మురళి గౌడ్, సింగవరం నాగభూషణం, చిలుకూరి శ్రీనివాసులు, రాంబాబు, రఘు, వీరసేన ఉన్నారు.