
క్రీడలతోనే ఆరోగ్యం పదిలం
గద్వాలటౌన్: ఆటలు ఆడటం ద్వారానే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జితేందర్ అన్నారు. శుక్రవారం స్థానిక సోమనాద్రి స్టేడియంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణా శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ఆటల్లో ముందుండాలని, క్రీడలతో దేహ దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందన్నారు. నైపుణ్యం గల క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామని భరోసా ఇచ్చారు. మీతోపాటు మీ ఇంటి దగ్గర ఉండే మీ స్నేహితులను వేసవి శిక్షణ శిబిరానికి తీసుకు రావాలని సూచించారు. ఈ శిబిరం వేసవికే పరిమితం కాకుండా ఏడాది పొడువునా నిరంతరం క్రీడలు ఆడేవిధంగా కొనసాగాలని కోరారు. జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బండల వెంకట్రాములు మాట్లాడుతూ గద్వాలలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదవ లేదని, వారిని ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సెలవుల్లో క్రీడలు ఆడుతూ ఆనందంగా గడపాలని సూచించారు. ఉదయం, సాయంత్రం సాగే వేసవి శిక్షణా శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్థానిక సంస్కార్ స్కూల్ యాజమాన్యం వారు శిక్షణకు హాజరైన విద్యార్థులకు క్రీడా దుస్తులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి విజయ్, మాజీ కౌన్సిలర్ బండల పాండు, రాజారెడ్డి, చక్ర, ప్రవీణ్, వంశీ, రాము, సతీష్, పరుశ తదితరులు పాల్గొన్నారు.