
మలేరియా నిర్మూలనకు సమష్టి కృషి
గద్వాల క్రైం: మలేరియా నిర్మూలన కోసం ప్రజలు, వైద్య సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఇంచార్జ్ వైద్యాధికారి సిద్దప్ప అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాను మలేరియా రహిత జిల్లాగా చూసేందుకు ప్రతి ఒక్కరు వైద్యుల సలహాలు పాటిస్తే విజయం సాధిస్తామన్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ దోమల నివారణకు ప్రజలు స్వీయ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రధాన శత్రువు దోమలని, వాటి ద్వారా మలేరియా, చికెన్ గున్యా, డెంగీ, మెదడువాపు వ్యాధులు వస్తాయన్నా రు. కార్యక్రమంలో వైద్యులు రాజు పాల్గొన్నారు.