
ఉగ్రదాడిపై పెల్లుబికిన నిరసనలు
గద్వాలటౌన్: జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై ఆగ్రహావేశాలు పెల్లుబిక్కాయి. ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు మృత్యువాత పడటంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని నిరసిస్తూ బుధవారం వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు వేర్వేరుగా నిరసనలు వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని నిరసిస్తూ వీహెచ్పీ, బీజేపీ తదితర సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోట నుంచి కృష్ణవేణి చౌరస్తా వరకు ప్రధాన రహదారుల వెంట భారీ కాగాడాలు, కొవ్వొత్తులు, జాతీయ జెండాలు చేతపట్టి ప్రదర్శన చేపట్టారు. ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతి చెందిన పర్యాటకులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్పాష, జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు, ధర్మ ప్రసార సమితి ప్రాంత సంయోజక్ జగదీశ్వర్రెడ్డి, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బండల వెంకట్రాములు, ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు కరేంద్రనాథ్, మాట్లాడారు. ఉగ్ర శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు దేశమంతా ఐక్యంగా ఉందన్నారు. పర్యాటకులపై జరిపిన ఉగ్రదాడులకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. దేశంపై ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్న ఉగ్ర మూకలను అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రదాడులకు ప్రభుత్వం నుంచి ప్రతిచర్యను దేశ ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు గోపాల్రావు ఏక్బోటే, వైండింగ్ రాములు, దేవదాసు, రజక నర్సింహా, విజయ్కుమార్, ప్రభాకర్గౌడ్, గంట రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కాగడాలతో ర్యాలీ, మృతులకు నివాళి

ఉగ్రదాడిపై పెల్లుబికిన నిరసనలు