ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి రూరల్: తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య త్యాగాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు శుక్రవారం భూపాలపల్లి ఐడీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరై దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య చూపిన ధైర్యం, అంకితభావం నేటితరానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం పోరాడిన మహనీయుల మార్గంలోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు దొడ్డి కొమురయ్య సేవలను స్మరించుకొని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిర, సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి క్రాంతి కిరణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్ అప్పం కిషన్, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.


