ప్రచార హోరు..
ఇంటింటా ప్రచారం.. ఓటరు చెంతకే లీడరు..
భూపాలపల్లి
మున్సిపాలిటీలోని
వార్డులు
30
బరిలో ఉన్న
అభ్యర్థులు
107
భూపాలపల్లి రూరల్: నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియల అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య తేలింది. తుదిగా పోటీలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. దీంతో అభ్యర్థులు ప్రచార పర్వంలోకి దిగారు. ఇప్పటికే సోషల్ మీడియా ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం ప్రచార రథాలతో ప్రత్యేక పాటలు, నినాదాలతో గల్లీల్లో హోరెత్తిస్తున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు రంగంలోకి దిగారు.
పోటాపోటీగా ప్రచారం..
ప్రత్యర్థులెవరో తేలిపోవడంతో పోటాపోటీగా ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 9వ తేదీ వరకు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉండడంతో మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు తమ వార్డుల్లో ప్రచారజోరు పెంచారు. ఇంటింటికీ వెళ్తూ తామేం చేస్తామో చెబుతున్నారు. శ్రీఅన్న, అక్క, తమ్మీ, అవ్వ.. అంటూ పలకరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు..
ఎక్కడుంటే అక్కడికే..
తమ వార్డులో ఎంతమంది ఓటర్లు ఉన్నారు. వారంతా ఎక్కడెక్కడ ఉంటున్నారు.. అంటూ ఇప్పటికే ఓటర్ల జాబితాలను జల్లెడ పట్టేశారు. ఏ ఓటరు, ఎక్కడ ఉన్నారు. వారి కుటుంబంలో మిగిలినవారు ఎక్కడుంటున్నారు. ఇలా పూర్తి డాటా రాసేసుకున్నారు. దాని ప్రకారం కౌన్సిలర్ అభ్యర్థులు, వారి అనుచరులు లోకల్ ఓటర్లు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి స్వయంగా కలుస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి ఇటీవల చాలా కుటుంబాలు రామప్ప కాలనీ, డబుల్ బెడ్ రూంలకు వెళ్లి నివసిస్తున్నారు. వారి వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో ఉన్నవారికి ఫోన్లు చేస్తూ ఈ నెల 11న ఓటు వేయడానికి రావాలని కోరుతున్నారు.
ప్రతీ వార్డులో కొత్త ఓటర్లు..
మున్సిపాలిటీల్లో ప్రతీవార్డులో ఈసారి కనీసం వందకు తగ్గకుండా ఓటర్లు ఉన్నారు. వీరు ఎక్కడుంటారు, ఎలా కలవాలి, వీరికి ఎవరు దగ్గర ఎవరి ద్వారా వెళ్లి కలిస్తే మనకు ఓటేస్తారు.. ఇలా లెక్కలు వేసుకుంటూ కొత్త ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కొన్నివార్డుల్లో మూడునాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి దగ్గరికి వెళ్లి కలవడంతోపాటు ఎలక్షన్ రోజు వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చేలా వాహనాలనూ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. కాగా సుభాస్ కాలనీ, రాంనగర్, యాదవ కాలనీ, కృష్ణకాలనీ, టీటూ క్వార్టర్స్, ఎండీ క్వార్టర్స్లోకి వివిధ పార్టీల నాయకులు ఒకరు తర్వాత ఒకరు ప్రచారం నిర్వహించడంతో ఓటర్లు అసహానానికి గురవుతున్నారు.
ప్రచార రథాలు, హోరెత్తిస్తున్న పాటలు
ఓటర్లను కలిసేందుకు
అభ్యర్థుల ఆరాటం
ప్రచార హోరు..


