తుది పోరు నేడే..
ఎన్నికల సిబ్బంది నిరసన..
కాటారం: గ్రామపంచాయతీ ఎన్నికల తుది పోరుకు కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలింది. నేడు (బుధవారం) ఎన్నికల పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలోని కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో మూడో విడతలో భాగంగా సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బంది ఆయా మండలాల్లోని పోలింగ్ కేంద్రాలకు మంగళవారం సాయంత్రం వరకు చేరుకొని పోలింగ్ ప్రక్రియకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. నాలుగు మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్, ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
సర్పంచ్ బరిలో 297 మంది..
కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో 81 సర్పంచ్, 696 వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. మల్హర్ మండలంలో రెండు, మహాముత్తారంలో ఒకటి సర్పంచ్ స్థానాలు, మొత్తంగా 126 వార్డు సభ్యుల స్థానాలు ఏకగీవ్రం కావడంతో 78 సర్పంచ్, 570 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 297 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1,423మంది వార్డు సభ్యుల అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాలుగు మండలాల్లో 99,578 మంది ఓటర్లు ఉన్నారు.
పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది..
మూడో విడత ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు, సిబ్బంది మంగళవారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కాటారంలో బీఎల్ఎం గార్డెన్, మహదేవపూర్, మహాముత్తారం మండలకేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, మల్హర్లో తాడిచర్ల జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో సిబ్బందికి ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులను పంపిణీ చేశారు. పోలీస్ భద్రత నడుమ పోలింగ్ సిబ్బంది సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
విధుల్లో 1,887 మంది..
1,887 మంది పోలింగ్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. కాటారం మండలంలో 252 మంది పీఓలు, 322 మంది ఓపీఓలు, మహదేవపూర్లో 194 మంది పీఓలు, 257 మంది ఓపీఓలు, మహాముత్తారంలో 235 మంది పీఓలు, 250 మంది ఓపీఓలు, మల్హర్లో 154 మంది పీఓలు, 223 మంది ఓపీఓలు విధుల్లో ఉండనున్నారు.
అధికారుల పరిశీలన..
మూడో విడతలో భాగంగా ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. కాటారంలో కలెక్టర్ రాహుల్శర్మ, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఫణీంద్రరెడ్డి, డీఎస్పీ సూర్యనారాయణ, మహాముత్తారం, మల్హర్లో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, మహదేవపూర్లో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఏఎస్పీ నరేశ్కుమార్ పరిశీలించారు. పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
మూడో విడతకు ఏర్పాట్లు పూర్తి
● స్వేచ్ఛగా ఓటు హక్కు
వినియోగించుకోవాలి
● కలెక్టర్ రాహుల్శర్మ
కాటారం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడతలో కొనసాగనున్న ఎన్నికలకు సంబంధించి కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లోని పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. కాటారం మండలకేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్స్లో కొనసాగిన ఎన్నికల సామగ్రి పంపిణీని ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మూడో దశలో భాగంగా 78 గ్రామపంచాయతీలు, 570 వార్డుల్లో ఎన్నికల కోసం 696 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1,887 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్నారని అదనంగా 15 మంది జోనల్ అధికారులు, 30 మంది రూట్ అధికారులు, 32 మంది మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రిటికల్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన 35 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణ కోసం వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పోలింగ్ కోసం 825 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసినట్లు తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల నిర్వహణకు ప్రజలు అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. పొరపాటుకు తావులేకుండా నిష్పక్షపాతంగా, పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగవంతంగా కొనసాగించాలని ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా అదనపు సిబ్బందిని నియమించుకోవాలని కలెక్టర్ సూచించారు. మూడో విడత ఎన్నికలను సమర్థవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ ప్రత్యేక అధికారి శ్వేత, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి, అధికారులు పాల్గొన్నారు.
నాలుగు మండలాల్లో ఎన్నికలు
78 సర్పంచ్, 570 వార్డు స్థానాలకు..
పోలింగ్కు సర్వం సిద్ధం
రెమ్యూనరేషన్ పెంచాలని
పోలింగ్ సిబ్బంది నిరసన
ఆలస్యంగా పోలింగ్ కేంద్రాలకు
తరలిన సిబ్బంది
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, అధికారులు
మొదటి, రెండో విడత ఎన్నికలను సమర్థవంతంగా పూర్తి చేయడానికి కృషిచేసిన ఎన్నికల సిబ్బంది మూడో విడత రెమ్యూనరేషన్ విషయంలో అసహనానికి గురయ్యారు. విధుల్లో పాల్గొనే పీఓలకు రెండు రోజులకు కలిపి రెమ్యునేషన్ రూ.1500 ఇవ్వనున్నట్లు సమాచారం ఉండటంతో రూ.2500 ఇవ్వాలని సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద నిరసనకు దిగారు. రెమ్యూనరేషన్పై స్పష్టత ఇచ్చే వరకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేది లేదని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్దనే కూర్చుండిపోయారు. మహాముత్తారంలో పీఓలు వీ వాంట్ జస్టిస్ అంటూ స్టేజ్ ఎదుట నినదించారు. సుమారు రెండు గంటల పాటు సిబ్బంది తమ నిరసన కొనసాగించగా చివరకు రూ.2వేలు అందిస్తామని అధికారులు ప్రకటించడంతో బ్యాలెట్ బాక్స్లు, పోలింగ్ సామగ్రితో వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. దీంతో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి ఆలస్యమైంది.
తుది పోరు నేడే..
తుది పోరు నేడే..


