‘డబుల్‌’.. ఎన్నాళ్లీ ట్రబుల్‌! | - | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’.. ఎన్నాళ్లీ ట్రబుల్‌!

Sep 8 2025 4:50 AM | Updated on Sep 8 2025 4:50 AM

‘డబుల్‌’.. ఎన్నాళ్లీ ట్రబుల్‌!

‘డబుల్‌’.. ఎన్నాళ్లీ ట్రబుల్‌!

నెరవేరని సొంతింటి కల...

మంజూరు నుంచి పంపిణీ వరకు అవాంతరాలే..

రెండు పడకల గదుల ఇళ్లకు మోక్షం ఎప్పుడు?

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలో 790 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 520 ఇళ్లు నిర్మించారు. మర్రిపల్లిగూడెం, గూడూరులో 50 చొప్పున 100 ఇళ్లు, కమలాపూర్‌లో 320 నిర్మించారు. రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్‌, వాటర్‌ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కొద్ది రోజులు కాలయాపన జరిగింది. ఇప్పటికీ లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేయకపోవడంతో ఇళ్లు నిరుపయోగంగానే ఉన్నాయి.

మహబూబాబాద్‌ జిల్లాలో 5,567 ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. 2024 వరకు 2,503 మాత్రమే పూర్తయ్యాయి. అందులో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 1,256 మందికి పంపిణీ చేశారు. ఇంకా 3,064 ఇండ్లు వివిధ స్థాయిల్లో ఉండగా.. పూర్తయిన 2,503 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ఇంకా 1,247 లబ్ధిదారులకు అందజేయడంలో కాలయాపన జరుగుతోంది.

.. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పథకానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మోక్షం కలగడం లేదు. నిర్మాణాలు పూర్తయినా ఇళ్లపంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఫలితంగా మూడేళ్ల కిందట పూర్తయిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు పంపిణీకి నోచుకోక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వివిధ స్థాయిల్లో నిలిచిపోయిన నిర్మాణాల్లో గడ్డి, ముళ్లపొదలు ఏర్పడ్డాయి. పంపిణీ చేసిన వాటిలో సరైన మౌలిక సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లు పథకంలో అవకాశం రాక అర్హులైన వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అసంపూర్తి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, పూర్తయిన వాటిని పంపిణీ చేయాలన్న డిమాండ్‌ వస్తుంది. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో అవకాశం రాని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.

పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సొంతింటికలను సాకారం చేసే లక్ష్యంతో, గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని అమలు చేసింది. ఉమ్మడి వరంగల్‌లో ఈ పథకం కింద రెండు విడతల్లో 26,284 ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో అధికారులు చెబుతున్న ప్రకారం సుమారు రూ.860 కోట్ల వరకు ఖర్చు చేసి 10,939 (41.62 శాతం) ఇళ్లు పూర్తి చేశారు. అందులో నుంచి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 4,874 (44.56 శాతం) రెండు పకడల గదుల ఇళ్లను పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా మంజూరైన మొత్తం 26,284లలో 4100 వరకు వివిధ కారణాలతో నిర్మాణాలు మొదలు పెట్టలేదు. నిర్మాణాలు ప్రారంభించిన 22,184 ఇళ్లలో 10,939 పూర్తయ్యాయి. 11,245 ఇళ్లు వివిధ స్థాయిల్లో నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల కొన్నేళ్ల క్రితం చేపట్టిన ఈ ఇళ్ల నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు. పూర్తయిన 10,939 ఇళ్లలో 4,874 ఇళ్లు మాత్రమే పంపిణీ చేశారు. 6,065 ఇళ్ల మంజూరులో జాప్యం జరుగుతుండడంతో ఉండడానికి గూడులేక వేలాది మంది నిరుపేదలు ఏళ్లపాటు గుడిసెల్లో జీవిస్తూ పక్కా ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

జిల్లా మంజూరు పూర్తి పంపిణీ

హనుమకొండ 4,326 2,143 1,200

వరంగల్‌ 6,350 2,350 1,250

జేఎస్‌ భూపాలపల్లి 3,882 1,615 710

జనగామ 4,400 1,600 750

ములుగు 1,800 950 300

మంజూరైన ఇళ్లలో పూర్తయినవి 41.62 శాతమే

పూర్తయిన ఇళ్లలో

పంపిణీ చేసింది 44.56 శాతం

చాలాచోట్ల శిథిలావస్థకు గృహాలు

వివిధ స్థాయిల్లో నిలిచినవి 11,245..

ఆ నిర్మాణాలపై నీలినీడలు

నెరవేరని పేదోళ్ల సొంతింటి కల..

శ్రీఇందిరమ్మశ్రీపై అర్హుల ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement