ప్రోత్సాహమేది? | - | Sakshi
Sakshi News home page

ప్రోత్సాహమేది?

Jun 13 2025 3:20 PM | Updated on Jun 13 2025 3:20 PM

ప్రోత్సాహమేది?

ప్రోత్సాహమేది?

కాటారం: ఒకప్పుడు కూరగాయల సాగుకు నిలయంగా నిలిచిన జిల్లాలోని పల్లెలు ప్రస్తుతం సాగుకు దూరమవుతున్నాయి. పల్లెప్రాంతాల్లో నాణ్యమైన, తాజా కూరగాయలను పండించి పట్టణ ప్రాంతాలకు తరలించే రైతులు పలు కారణాలతో సాగుపై నిరాసక్తి కనబరుస్తున్నారు. కూరగాయల సాగుకు ప్రభుత్వం ద్వారా సరైన ప్రోత్సాహం అందకపోగా సాగు రైతులకు సంబంధిత శాఖల అధికారులు అవగాహన కల్పించకపోవడంతో క్రమంగా జిల్లాలో కూరగాయల సాగు తగ్గిపోతుంది. పండించిన కూరగాయలను విక్రయించడానికి మార్కెట్‌ లేకపోవడం సాగుపై మరింత ప్రభావం చూపుతుంది. కూరగాయల సాగుకు కేరాఫ్‌గా ఉన్న గ్రామాలు ప్రస్తుతం వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఒకప్పుడు ఎకరాల కొద్ది కూరగాయలు సాగుచేసిన రైతులు కేవలం తమ ఇంటి అవసరాలకు కూరగాయలను పండించడానికి పరిమితం అవుతున్నారు. సాగు తగ్గిపోవడంతో బహిరంగ మార్కెట్‌లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.

జిల్లాలో అత్యల్పంగా సాగు..

రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతున్నట్లు అధికారుల లెక్కలు చెపుతున్నాయి. కానీ జిల్లాలో మాత్రం గతేడాది 190 ఎకరాల్లో మాత్రమే కూరగాయల సాగు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో సుమారుగా 250 ఎకరాల నుంచి 300 ఎకరాల వరకు కూరగాయల సాగు జరిగే అవకాశం ఉన్నట్లు ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా కొద్ది మొత్తం వ్యత్యాసంతోనే కూరగాయల సాగు జరుగుతున్నప్పటికీ రాష్ట్రంలోని మిగితా జిల్లాలతో పోల్చుకుంటే జిల్లాలో అత్యల్పంగా సాగు జరుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కాటారం, చిట్యాల, మహదేవపూర్‌ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో పలు రకాల కూరగాయలను పండించేవారు. ప్రస్తుతం అలాంటిది కనిపించడం లేదు.

పెరుగుతున్న కూరగాయల ధరలు..

స్థానికంగా కూరగాయల సాగు తగ్గిపోవడంతో జిల్లాలో కూరగాయల కొరత ఏర్పడుతుంది. వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. దీంతో కూరగాయల ధరలు అధికమవుతున్నాయి. ప్రస్తుతం కూరగాయల ధరలు చూస్తే టమోట కిలో 60, వంకాయ కిలో రూ.50, బెండకాయ రూ.60, పచ్చిమిర్చి కిలో రూ.60, బీరకాయ రూ.80, దొండకాయ రూ.70గా ఉన్నాయి,

అందుబాటులో లేని మార్కెట్‌..

జిల్లాలో సరైన మార్కెట్‌ సదుపాయం లేకపోవడం కూరగాయలు సాగు చేసే రైతులకు సమస్యగా మారింది. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని కూరగాయలు పండిస్తే అవి అమ్ముకోవడానికి వారు తీవ్ర ఇబ్బందులుపడాల్సి వస్తుంది. రైతుల చేతికి వచ్చిన కూరగాయలను గోదావరిఖని, వరంగల్‌ మార్కెట్‌కు తరలించి అమ్ముకోవాల్సి వస్తుంది. అధిక రవాణా భారం, సమయం వృథా అవుతుండటంతో రైతులు కూరగాయల సాగుకు స్వస్తి పలుకుతున్నారు.

కూరగాయల సాగుపై

ప్రత్యేక దృష్టి

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో సాగు పెంచేందుకు ఉధ్యానశాఖ ద్వారా కృషి చేస్తున్నాం. ప్రభుత్వం ద్వారా అందుతున్న ప్రోత్సాహకాలు తప్పకుండా రైతులకు చేరేలా చూస్తాం. కూరగాయల సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించి మంచి దిగుబడులు సాధించేలా పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నాం.

– మణి, హార్టికల్చర్‌ అధికారిణి,

మహదేవపూర్‌ సబ్‌ డివిజన్‌

జిల్లాలో సాగు వివరాలు..

సంవత్సరం ఎకరాలు

2020–21 271

2021–22 130

2022–23 123

2023–24 75

2024–25 190

2025–26(ప్రస్తుతం) 250 అంచనా

కూరగాయల సాగుకు ఆదరణ కరువు

ఏటేటా తగ్గుతున్న సాగు విస్తీర్ణం

రాష్ట్రంలోనే జిల్లా అట్టడుగు స్థాయి

మార్కెట్‌ అందుబాటులో లేకపోవడంతో రైతుల ఇబ్బందులు

అవగాహన కల్పించడంలో

అధికారులు విఫలం

కానరాని అవగాహన..

ప్రభుత్వం ద్వారా కూరగాయల సాగు రైతులకు ప్రోత్సాహం అందకపోవడంతో పాటు సంబంధిత అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడంతో రైతులు కూరగాయల సాగుకు దూరమవుతున్నారు. గతంలో కూరగాయల విత్తనాలు ప్రభుత్వం సరఫరా చేసేది. పందిర్ల నిర్మాణం, డ్రిప్‌ ఏర్పాటుకు సబ్సిడీ అందజేసేవారు. ప్రస్తుతం కూరగాయలు సాగుచేసే రైతులకు అవేమీ అందడం లే దు. ప్రభుత్వం పత్తి, మిర్చి, వరి విత్తనాలతో పాటు మరికొన్ని వాణిజ్య పంటలకు రాయితీలు ఇస్తుంది. దీంతో రైతులు వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. తమ ఇళ్ల వద్ద ఉండే అరెకరం, ఎకరం భూ విస్తీర్ణంలో సైతం పత్తి, మిర్చి సాగుకు పూనుకుంటున్నారు. నీటి సౌకర్యం ఉంటే వరి పండిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement