
పుస్తకం లేకుండా పాఠం!
రెండో సెమిస్టర్కు పుస్తకాలే లేవు..
డిగ్రీ, పీజీ కోర్సుల్లో మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. డిగ్రీ పరీక్షల ఫలితాలు రావాల్సింది. పీజీ కోర్సుల్లో ఎమ్మెస్సీ బాటనీ, ఫిజిక్స్ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల చేశారు. మిగతా సైన్స్ కోర్సుల సబ్జెక్టుల పరీక్షల ఫలితాలు రావాల్సింది. 2023–24లో మొదటి సెమిస్టర్లలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ప్రస్తుతం మూడో సెమిస్టర్లో ఉండాలి కానీ, ఇప్పటివరకు వారికి సెకండ్ సెమిస్టర్ తరగతులకు నిర్వహించకపోగా.. పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్ ఇవ్వలేదు. ప్రధానంగా ఇయర్ వైజ్ పద్ధతి నుంచి సెమిస్టర్ సిస్టమ్ను ప్రవేశపెట్టాక సెమిస్టర్ సిస్టమ్లో పుస్తకాలు రాయించాల్సి ఉంటుంది. కానీ, అలా చేయకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య కేంద్రంలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) డిగ్రీ, పీజీ తదితర కోర్సులకు ఒకప్పుడు బాగా డిమాండ్ ఉండేది. కానీ, కొన్నేళ్లుగా వీటిలో చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించకపోవడం, తరగతులు, పరీక్షలు నిర్ణీతసమయంలో ఉండకపోవటం, పరీక్షలు రాశాక ఫలితాలు ఎప్పుడు వస్తాయో నిరీక్షించాల్సిన పరిస్థితులతో అసలెందుకు చేరామోనని విద్యార్థులు ఆవేదన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కొత్తగా చేరేవారి సంఖ్య సైతం తగ్గిపోతోంది. యూనివర్సిటీ యూజీసీ డెక్ నిబంధనల ప్రకారం ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలోని విద్యార్థులకు దూరవిద్య కేంద్రంలో అడ్మిషన్లు కల్పించాల్సి ఉంటుంది. డిగ్రీ, పీజీ కోర్సుల్లో 2023– 24 విద్యాసంవత్సరంనుంచి సెమిస్టర్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. అన్ని కోర్సులు కలిపి 5,518మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరికి సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించలేకపోయారు. ఆలస్యంగా అరకొరగానే పుస్తకాలు ఇచ్చారు.
ముద్రించని మెటీరియల్..
పీజీ సైన్స్ కోర్సుల్లో ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టులు ఒక సెమిస్టర్కు మొత్తంగా 21 పాఠ్యపుస్తకాలు ఉంటాయి. వివిధ సబ్జెక్టులకు సంబంధించి 10 పుస్తకాలను సంబంధిత అధ్యాపకులతో రాయించారు. ఈ ప్రక్రియ కూడా ఆలస్యమవడంతో పరీక్షలకు కొన్నిరోజులముందు ముద్రించి ఇచ్చారు. మిగతా 11 పాఠ్యపుస్తకాల్లో 8 పుస్తకాలు రాయించారు. కానీ, పుస్తకరూపంలో ముద్రించడం లేదు. అయినప్పటికీ ఈ ఏడాది జనవరిలో పీజీ సైన్స్కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. కొన్ని సబ్జెక్టుల స్టడీ మెటీరియల్ను పీడీఎఫ్లో విద్యార్థుల మొబైల్స్కు పంపారు. పీజీ ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ కోర్సుల్లో కూడా మొదటి సెమిస్టర్కు పాఠ్యపుస్తకాలు కొన్నింటిని మాత్రమే ఇచ్చి, మిగతావి పీడీఎఫ్ రూపంలో అందించారు. సెన్స్ పరీక్షలు నిర్వహించిన నెలరోజుల తరువాత ఈ పరీక్షలు నిర్వహించారు.
ప్రతి ఆరునెలలకో సెమిస్టర్ పూర్తి..
ప్రతి ఆరునెలలకో సెమిస్టర్ పూర్తికావాల్సి ఉండగా.. ఏడాది దాటిపోయాకే మొదటి సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థులు రెండో సెమిస్టర్ ఎప్పుడు ఉంటుంది.. పుస్తకాలు ఎప్పడిస్తారనే సమాచారం కోసం దూరవిద్యకేంద్రంలోగానీ, ఫోన్ ద్వారా కోరితే సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. ప్రధానంగా ఉద్యోగస్తులు ఎక్కువగా ప్రమోషన్లు, తదితర అవసరాల నిమిత్తం దూరవిద్య కోర్సుల్లో చేరుతారు. కానీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ఆలస్యంతో తాము నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
మొదటి సెమిస్టర్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి
డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో 2024–25 విద్యాసంవత్సరంలో మొదటి సెమిస్టర్లకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఒక బ్యాచ్కి గత ఏడాది సెప్టెంబర్– అక్టోబర్లో, మరో బ్యాచ్కు ఈఏ డాది జనవరి –మార్చి వరకు అడ్మిషన్లు కల్పించారు. ఈరెండు బ్యాచ్లను ఒకే విద్యాసంవత్స రం కిందికే పరిగణిస్తారు. అన్నికోర్సులు కలిపి 4,498 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. వీరిలో కొందరికి మాత్రమే పుస్తకాలు ఇచ్చారు.
ముద్రణకు టెండర్ ప్రక్రియలో జాప్యం..
పాఠ్యపుస్తకాలు రాయించడం.. వాటిని ముద్రించడంలో యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నినెలల క్రితమే యూనివర్సిటీ అధికారులు పాఠ్యపుస్తకాల ముద్రణకు టెండర్ నిర్వహించగా.. హనుమకొండకు చెందిన ఓ ప్రింటర్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. అగ్రిమెంట్ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు పుస్తకాల ముద్రణకు ఆర్డర్ ఇవ్వలేదు. కేయూ పాలకమండలి సమావేశంలో ఫైనాన్సియల్ అప్రూవల్ కోసం పెట్టాకే పుస్తకాలను ముద్రణకు ఇస్తారని సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది.
కేయూ దూరవిద్య కోర్సుల్లో ముద్రణకు నోచని పుస్తకాలు
అరకొరగా అందజేత.. మిగతావి పీడీఎఫ్ రూపంలో విద్యార్థులకు..
అస్తవ్యస్తంగా సెమిస్టర్ విధానం. ఆలస్యంగా పరీక్షల నిర్వహణ..
రోజురోజుకూ తగ్గిపోతున్న
విద్యార్థుల సంఖ్య