
సులభంగా.. వేగంగా..
రేపటి నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలు
భూపాలపల్లి అర్బన్: వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత సులభం కానుంది. గంటల తరబడి కార్యాలయాల్లో నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఇళ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లను త్వరగా పూర్తి చేసేలా ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రేపటి (సోమవారం) నుంచి అమలు కానుంది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లపై అమ్మిన, కొన్నవారితో పాటు సాక్షులు, సబ్ రిజిస్ట్రార్ వ్యక్తిగతంగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. దీనికి ఎక్కువ సమయం పడుతుండడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సర్కారు సంకల్పించింది. ఇందుకోసం ఆధార్ ఈ సంతకం అమలు చేసేందుకు కూడా సిద్ధమమైంది. తద్వారా జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయవచ్చని భావిస్తోంది.
సేవల్లో పారదర్శకత
రిజిస్ట్రేషన్ సేవలు వేగంగా, పారదర్శకంగా అందించాలని స్లాట్ బుకింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఏప్రిల్ 10 నుంచి స్లాట్ బు కింగ్ విధానాన్ని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమల్లోకి తీసుకొచ్చింది. అక్కడ విజయవంతం కావడంతో జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది. ఇకపై 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది.
ఒక్కో సబ్ రిజిస్ట్రార్కు 48 స్లాట్లు..
సబ్ రిజిస్ట్రార్ రోజుకు 48 స్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించారు. 48కి మించి స్లాట్లు బుక్ చేయడానికి వీలు లేదు. అయితే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలవడంతో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు చాలా తగ్గిపోయాయి. ప్రస్తుతానికి 48 డాక్యుమెంట్లకు మించి అవసరం లేదని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ విధానం పైలెట్ జిల్లాలో విజయవంతమైంది. స్లాట్ బుకింగ్ ద్వారా రోజుకు ఒక సబ్ రిజిస్ట్రారు 48 స్లాట్లుగా నిర్ణయించారు. ఉదయం 24 స్లాట్లు, మధ్యాహ్నం 24 డాక్యుమెంట్లు చేసేలా విభజించారు. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా రిజిస్ట్రేషన్.తెలంగాణ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాబ్ బుక్ చేసుకుని సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది.
వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లు అంటే..
రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకోని వారు ఈ వాక్ ఇన్ విధానాన్ని వినియోగించుకోవచ్చు. ముఖ్యమైన, అత్యవసర సమయంలో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఐదు డాక్యుమెంట్లను స్లాట్తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. స్లాట్ బుక్ చేసుకోనివారు నేరుగా సాయంత్రం 5 గంటలకు కార్యాలయానికి వెళితే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు.
స్లాట్ బుక్ చేసుకొని రావాల్సిందే..
రిజిస్ట్రేషన్ల ప్రక్రియను స్లాట్ బుకింగ్ విధానంతో జూన్ 2 నుంచి అమలు కానుంది. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారు స్లాట్ బుక్ చేసుకొని రావాల్సి ఉంది. స్లాట్ బుకింగ్ సమయంలో కొనుగోలు, అమ్మకందారులు, మధ్యవర్తులు తప్పనిసరిగా ఉండాలి. స్లాట్ బుకింగ్ లేకుండా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయలేం. ప్రజలు గమనించి సహకరించాలి.
– రేగళ్ల రాము, సబ్ రిజిస్ట్రార్
అత్యవసరమైన వారి కోసం వాక్ ఇన్ విధానం
గంటల తరబడి నిరీక్షణకు తెర

సులభంగా.. వేగంగా..

సులభంగా.. వేగంగా..