
అవతరణ వేడుకలకు ఏర్పాట్లు
భూపాలపల్లి: రాష్ట్ర అవతరణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి శుక్రవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాచార, డీఆర్డీఏ, సంక్షేమ, అటవీ, ఉద్యాన, వ్యవసాయ తదితర శాఖలు స్టాల్స్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అమరవీరుల స్తూపం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను పూలతో అందంగా ముస్తాబు చేయాలని సూచించారు. వేడుకలకు సంబంధించి ప్రొటోకాల్ పాటిస్తూ అతిథులు కూర్చోవడానికి కుర్చీలు, షామియానాలు, సురక్షిత తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమాలను భూపాలపల్లి ఆర్డీఓ ఆసాంతం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, భూపాలపల్లి ఆర్డీఓ రవి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు పరిశీలన..
గణపురం: రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. శుక్రవారం గణ పురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, బుర్రకాయలగూడెంలోని ధనలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్మిల్లును కలెక్టర్ పరిశీలించారు. లక్ష్మారెడ్డిపల్లెలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యపు తేమ శాతాన్ని పరిశీలించి నిర్ధేశిత శాతం తేమ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. బుర్రకాయలగూడెంలో రైస్మిల్ను పరిశీలించి మిల్లర్తో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే దిగుమతి చేసుకోవాలని, అందు కు తగినంత మంది హమాలీలను సిద్ధంగా ఉంచా లని సూచించారు. శుక్రవారం వరకు 12,319 మంది రైతుల నుంచి 74,425 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. గత సంవత్సరం ఈ సీజన్లో 43,990 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని, గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం ఎక్కువ మొత్తంలో ధాన్యం కొనుగోలు జరిగినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, సహకార అధికారి వాలియానాయక్ తదితరులు పాల్గొన్నారు.
రైతులను ఇబ్బందికి గురి చేయొద్దు
కలెక్టర్ రాహుల్ శర్మ