
అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
కాటారం: కాటారం మండల కేంద్రం మీదుగా హైదరాబాద్కు అక్రమంగా వాహనంలో తరలిస్తున్న పశువులను బుధవారం కాటారం పోలీసులు పట్టుకున్నారు. ప్రొబిషనరి ఎస్సై గీతారాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పశువుల అక్రమ రవాణా జరుగుతుందనే పక్కా సమాచారం మేరకు కాటారం–మంథని ప్రధాన రహదారిపై పోలీసులు, పశువైద్యాధికారి ధీరజ్ సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఇదే క్రమంలో మంథని వైపుగా వెళ్తున్న కంటైనర్ వ్యాన్ను పరిశీలించగా అందులో పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఏడు ఎద్దులు, 23 కోడె లేగలతో కూడిన వ్యా న్ను పోలీస్స్టేషన్కు తరలించారు. కాటారం మండలం ఇబ్రహీంపల్లికి చెందిన సయ్యద్ ఖయ్యూబ్, అఫ్రోజ్, పోతుల్వాయికి చెందిన పిట్టల అనిల్, సిద్దిపేటకు చెందిన వ్యాన్ డ్రైవర్ షరీఫ్ను అదుపులోకి తీసుకుని విచారించగా మహాముత్తారం మండలం రెడ్డిపల్లికి చెందిన హరిబాబు వద్ద పశువులను అక్రమంగా కొనుగోలు చేసి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు నిందితులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. పశువైద్యాధికారి డాక్టర్ ధీరజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గీతారాథోడ్ తెలిపారు. కాగా జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ కుమారస్వామి ఆధ్వర్యంలో పశువులను రాంపూర్ గోశాలకు తరలించారు.