భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని మైనారిటీ గురుకులంలో ఖాళీగా ఉన్న సీట్లకు నేడు(గురువారం) లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు గురుకుల ప్రిన్సిపల్ రవి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాన్ మైనారిటీ విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారు అర్హులని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో డ్రా నిర్వహించనున్నట్లు చెప్పారు.
హానికర రసాయనాలు వాడొద్దు
మల్హర్: మామిడికాయలు మాగబెట్టే ప్రక్రియలో హానికారక రసాయనాలు వాడొద్దని జిల్లా ఉద్యాన అధికారి సునీల్ అన్నారు. మామిడికాయలు మాగబెట్టే విధానంపై సేవా స్ఫూర్తి ఫౌండేషన్, ఉద్యాన శాఖ జిల్లా అధికారి సునీల్ ఆధ్వర్యంలో బుధవారం తాడిచర్ల గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాయల పక్వత, కాయలు నిల్వచేసే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్రావు, డివిజన్ ఉద్యాన అధికారి మణి, మండల వ్యవసాయ అధికారి శ్రీజ, రైతులు సుద్దతి రాజేశ్వర్రావు, గంగుల రవి, నరేష్, బండి రాజేందర్, ఓదెలు, కుమార్ పాల్గొన్నారు.
విశ్రాంతి గది ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 5వ గనిలో మహిళా ఉద్యోగుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన విశ్రాంతి గదిని బుధవారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి ప్రారంభించారు. కేటీకే 5వ గనిలో మహిళా ఉద్యోగులు 35మంది పని చేస్తున్నారని, మహిళల భాగస్వామ్యం పెరిగిన దృష్ట్యా విశ్రాంతి గదిని ఏర్పాటు చేసినట్లు జీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, వెంకటరమణ, జాకీర్హుస్సేన్, కార్మిక సంఘాల నాయకులు తిరుపతి, గట్టు రాజు పాల్గొన్నారు.
పుష్కరాల పనులను పరిశీలించిన సీఎండీ
కాళేశ్వరం: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి బుధవారం పరిశీలించారు. అనంతరం సబ్స్టేషన్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఐదు ఎంవీఏ ట్రాన్స్ఫార్మన్ను ప్రారంభించారు. ఆయనతో రాజుచౌహాన్, ఎస్ఈ మల్చూరు నాయక్, డీఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు, ఏఈ శ్రీకాంత్ ఉన్నారు.
కాళేశ్వరంలో దేవాదాయశాఖ కమిషనర్ పూజలు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు బుధవారం దర్శించుకున్నారు. ఆయన రాజగోపురం వద్దకు రాగా అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ శుభానందదేవి అమ్మవారి దర్శనం అనంతరం కమిషనర్ను అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ శనిగెల మహేష్ స్వామి వారిని శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేసీ రామకృష్ణారావు, డీసీ సంధ్యారాణి, ఏసీ సునీత, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కవిత, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.