
బస్సులపై పర్యవేక్షణ కరువు
కాటారం: సరస్వతీ ఫుష్కరాల్లో భాగంగా భక్తుల ఉచిత రవాణా సౌకర్యార్థం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన షటిల్ బస్సుల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. పుష్కరాలకు వచ్చే భక్తుల రవాణా కోసం సింగరేణి సంస్థ ఉచిత బస్సులను ఏర్పాటు చేసింది. పలు ప్రాంతాల్లోని ప్రైవేట్ పాఠశాలలు, ఇతరత్రా సంస్థలకు చెందిన మినీ బస్సులను సింగరేణి సంస్థ అద్దె ప్రతిపాదికన పుష్కరాల వినియోగం కోసం కేటాయించింది. మొదటగా తాత్కాలిక బస్టాండ్ నుంచి సరస్వతీ ఘాట్ వరకు భక్తులను షటిల్ బస్సుల ద్వారా చేరవేశారు. భక్తుల రద్దీ పెరగడం ట్రాఫిక్ జాం కారణాలతో ప్రైవేట్ వాహనాలను కాళేశ్వరానికి కొంత దూరంలో నిలిపివేయడంతో అక్కడి నుంచి భక్తులను రవాణా చేయడం కోసం షటిల్ బస్సులను వినియోగంలోకి తీసుకొచ్చారు. రెండు రోజులుగా భక్తుల రద్దీ కారణంగా కాళేశ్వరంలో అస్తవ్యస్తం నెలకొనడంతో షటిల్ బస్సుల సేవలు పేలవంగా తయారయ్యాయి. షటిల్ బస్సుల సేవలను పర్యవేక్షించే వారు లేకపోవడంతో బస్సుల డ్రైవర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలువురు భక్తులు తెలిపారు. భక్తులను చేరవేయాల్సిన బస్సులను డ్రైవర్లు పక్కకు నిలుపుకొని ఉంటున్నారని వారు వాపోయారు. దీంతో భక్తులు కాలినడకన ఘాట్ వద్దకు అక్కడి నుంచి ఆలయానికి చేరుకోవాల్సి వస్తుంది. షటిల్ బస్సుల సేవలపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి సేవలు సక్రమంగా అందేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.