
పుష్కరాల పనుల్లో వేగం పెంచండి
కాళేశ్వరం: మే 15నుంచి 26వరకు కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతి నది పుష్కరాల్లో అధికారులు సమన్వయంతో పనిచేసి వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మంగళవారం కలెక్టర్ వీఐపీ ఘాటు విస్తరణ పనులు, సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు, టెంట్ సిటీ ఏర్పాటు, పార్కింగ్ ప్రదేశాలు, వంద గదుల గెస్ట్హౌస్, జాయ్రైడ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్న ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం ఈఓ కార్యాలయంలో పనుల పర్యవేక్షణ ప్రత్యేక అధికారులు, రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, ఇరిగేషన్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్, రవాణా, వైద్య తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ వీఐపీ ఘాట్ వద్ద టెంట్ సిటీ, ఎగ్జిబిషన్, ఫుడ్ కోర్టు, స్టాళ్లు, కిడ్స్ జోన్ తదితర ఏర్పాటు చేసేందుకు స్థలాలకు మార్కింగ్ చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. వీఐపీ ఘాట్ వెళ్లే రహదారి నిర్మాణానికి మార్కింగ్ చేయాలన్నారు. హెలికాప్టర్లో జాయ్రైడ్ చేసేందుకు కౌంటర్ ఏర్పాటుచేయాలని తెలిపారు. పుష్కరాల్లో భక్తులకు ప్రత్యేక ఘాట్లు, తాత్కాలిక వసతి కేంద్రాలు, ఆరోగ్య శిబిరాలు, తాగునీటి ఏర్పాట్లు, పరిశుభ్రత చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు స్టేజీ ఏర్పాట్లు, విద్యుద్ధీకరణ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రవచన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. రెవెన్యూ, పోలీస్, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి విద్యుద్ధీకరణ చేయాలని సూచించారు. విధుల్లో ఉండే సిబ్బందికి నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, పార్కింగ్, ఆర్టీసీ ప్రదేశాల్లో సురక్షిత తాగునీరు సరఫరా చేయాలని తెలిపారు. భక్తులు నదిలోకి వెళ్లడానికి చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎండోమెంట్కు సంబంధించిన శ్రాద్ధ మండపం, సరస్వతిమాత విగ్రహం పనులు, ప్రసాదం కౌంటర్ పనులు నెమ్మదిగా జరుగుతుండడంతో అసహనం వ్యక్తం చేశారు. మే 4వరకు పనులన్నీ పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, దేవస్థానం సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మల్చూర్నాయక్, ఎండోమెంట్ ఎస్ఈ కనకదుర్గా ప్రసాద్, డీపీఓ నారాయణరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు తిరుపతిరావు, వెంకటేశ్వర్లు, నిర్మల, ఆబ్కారీ ఈఎస్ శ్రీనివాస్, కాటారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఐ రామచందర్రావు, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు.
మే 4వరకు పూర్తిచేయాలని ఆదేశం
కలెక్టర్ రాహుల్శర్మ