
భూ భారతితో సమస్యల పరిష్కారం
కాటారం: భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం అమల్లోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. కాటారం మండలకేంద్రంలోని రైతు వేదికలో శనివారం భూ భారతి, నూతన ఆర్ఓఆర్ చట్టం 2025పై అవగాహన సదస్సు నిర్వహించారు. భూ భారతి చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలను రైతులు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. రైతులు అడిగిన ప్రశ్నలను కలెక్టర్, అధికారులు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి చట్టంతో రైతుల భూములకు రక్షణ లభిస్తుందన్నారు. భూ సమస్యలపై రైతులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని.. నిర్దేశ సమయంలో పరిష్కారం లభిస్తుందన్నారు. భూ భారతి చట్టంలో తహసీల్దార్ నుంచి ఆర్డీఓ, కలెక్టర్ అక్కడి నుంచి ల్యాండ్ ట్రిబ్యునల్కు అప్పీలుకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. రైతులకు భూ చట్టాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సాదాబైనామాకు సంబంధించి ఇతరులతో చర్చించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించి పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రైతుకు ఆధార్కార్డు లాగే భూదార్కార్డు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ అధికారులు భూ భారతిపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, తహసీల్దార్ నాగరాజు, నయాబ్ తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీఓ బాబు, ఆర్ఐ వెంకన్న, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాహుల్శర్మ, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ పాల్గొన్నారు. కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు రాకుండా సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సహకార సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పౌరసరఫరాలశాఖ అధికారి శ్రీనాథ్, డీఎం రాములు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్శర్మ
పనుల్లో నాణ్యత పాటించాలి
కాళేశ్వరం: సరస్వతి నది పుష్కరాల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నిర్మాణాలపై వాటర్ క్యూరింగ్ సరిగ్గా చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. కాళేశ్వరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం పరిశీలించి, నిర్దేశిత సమయానికి సరస్వతి పుష్కరాల పనులను పూర్తిచేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. 12 రోజుల పాటు సరస్వతి పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున తాత్కాలిక, శాశ్వత ఏర్పాటు పనులను వేగవంతంగా పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఈఓ మహేష్, డీపీఓ నారాయణరావు, ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు, డీఈ సూర్యప్రకాశ్, ఎస్సై తమాషారెడ్డి, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రటి ఎండలో కాలినడకన..
కలెక్టర్ రాహుల్శర్మ, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, విజయలక్ష్మి, సబ్కలెక్టర్ మయాంక్సింగ్లతో పాటు ఇతర అధికారులు 41 డిగ్రీల ఎర్రటి ఎండలో మిట్ట మధ్యాహ్నం సుమారు 600మీటర్లు కాలినడక వీఐపీఘాటు వద్దకు వెళ్లారు. పనుల పరిశీలన అనంతరం తిరిగి అదేదారిలో నడుచుకుంటూ వచ్చారు.

భూ భారతితో సమస్యల పరిష్కారం