రేటు పెరిగిన ఓటు!
మొదటి విడత ఓటములే పాఠాలు
జనగామ: జిల్లాలో మొదటి విడత పోలింగ్ ఫలితాలను అనుభవంగా తీసుకుంటూ, రెండో విడతలో ఎలాగైనా గెలుపే లక్ష్యంగా జనగామ నియోజకవర్గ సర్పంచ్, వార్డుమెంబర్ అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. నాలుగు మండలాల్లోని అభ్యర్థులు వ్యూహాలు రచిస్తూ, పోలింగ్కు ముందురోజు రాత్రి నుంచి ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రజాస్వామ్య పండుగగా ఉండాల్సిన ఎన్నికలు డబ్బులు, గిఫ్టుల పోటీగా మార్చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పోలింగ్కు ముందు అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు ప్రత్యర్థి ఎంత ఇస్తున్నాడన్న సమాచారాన్ని నిఘా వర్గాల ద్వారా తెలుసుకుంటూ, అంతకంటే 10 నుంచి 20 శాతం ఎక్కువ ఇవ్వాలన్న నిర్ణయాలతో అభ్యర్థులు వేచిచూసే ధోరణి అవలంబించారు. పలు గ్రామాల్లో తెల్లవారుజాము 3 గంటల నుంచి ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు, మరికొన్ని కీలక గ్రామాల్లో రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పంపిణీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎలక్షన్ కమిషన్ నిఘా, అనేక బృందాలు 24 గంటల పాటు నిఘా ఉంచినప్పటికీ, ఇంతపెద్ద మొ త్తంలో డబ్బులు ఎలా పంచారనే దానిపై సా మాన్య ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.
సర్పంచ్ ఎలక్షన్లలో కనివిని ఎరగని రీతిలో కోట్ల రూపాయలు వరదలా పారిస్తున్న పరిణామాలపై సీనియర్ సిటిజన్లు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గెలుపు తర్వాత ఈ ఖర్చును ఎలా రాబట్టుకుంటారన్న ప్రశ్న పక్కన పెడితే, భారీగా ఖర్చు చేసి ఓట్లను కొనుగోలు చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆశించిన ఓట్లను రాబట్టుకునేందుకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని పలుచోట్ల సర్పంచ్, వార్డు అభ్యర్థులు ప్రత్యేక టీంలను సిద్ధం చేసుకున్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓటు చొప్పున నగదు అక్కడికక్కడే పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం.
మొదటి విడతలో కొన్నిచోట్ల గెలుపు వాకిట నిలిచిన అభ్యర్థులు చిన్నచిన్న తప్పిదాలతో ఓటమిపాలవ్వడంతో, రెండో విడతలో అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదన్న ఆలోచనతో డబ్బుల పంపిణీతో పాటు రాత్రింబవళ్లు కాళ్లబేరాలు, వ్యక్తిగత సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా బచ్చన్నపేట వంటి పలు మండలాల్లో మినీ గ్యాస్ సిలిండర్లు, పొయ్యిలు, ఇతర గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ జోరుగా సాగింది. గెలుపు కోసం పడరాని పాట్లు పడుతూ లక్షలు ఖర్చు పెట్టేందుకు అభ్యర్థులు వెనుకాడడం లేదు. ఎక్కడ ఓట్లకు గండిపడుతుందోనన్న భయంతో కులాల వారీగా లెక్కలు వేసుకుంటూ, ఒకటికి రెండుసార్లు సంప్రదింపులు కొనసాగించారు. ఎక్కడా ఓటు మైనస్ కాకుండా మూడో కన్నుతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దీంతో జనగామ నియోజకవర్గంలో పోల్ మేనేజ్మెంట్ హై వోల్టేజ్కు చేరింది.
మొదటి విడతలో ఓడిన అభ్యర్థుల అనుభవాలే గుణపాఠం
కీలక గ్రామాల్లో ఒక్కో ఓటుకు
రూ.2 వేల నుంచి 3వేలు
పకడ్బందీ నిఘా ఉన్నా డబ్బులు, మద్యం, గిఫ్టుల పంపకాలు
రేటు పెరిగిన ఓటు!


