రఘునాథపల్లి: విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరి రశీదులు ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారి అంబికాసోని వ్యాపారులను ఆదేశించారు. రఘునాథపల్లి, ఫతేషాపూర్, నిడిగొండలోని పలు విత్తనాలు, ఎరువుల షాపులను గురువారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయా షాపుల్లో ఎరువుల నిల్వలు, లైసెన్స్, స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్స్, ఈ పాస్ మిషన్ బ్యాలెన్స్, స్టాక్ బోర్డు పరిశీలించారు. రైతులకు నకిలీ విత్తనాలు అంటగడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.
ఐక్యతే ఉద్యోగుల శక్తి
పాలకుర్తి టౌన్: ఉద్యోగులు ఐక్యంగా ఉంటే ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చని టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్ అన్నారు. పాలకుర్తి, దేవరుప్పల, కొడకండ్ల మండలాల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ సంఘం పాలకుర్తి యూనిట్ అధ్యక్షుడు బక్క మహేష్యాదవ్ అధ్యక్షతన జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి టీఎన్జీఓ ఎల్ల ప్పుడు ముందుంటుందని తెలిపారు. జిల్లా కార్యదర్శి పెండెల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్, హఫీజ్, వెంకటాచారి, శ్రీధర్, శివప్రసాద్, కాసర్ల రాజు పాల్గొన్నారు.
నేటి నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు
జనగామ: జిల్లాలో నేటి(శుక్రవారం) నుంచి నిర్వహించే స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణకు గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి (ఐఏఎస్) పింకేస్ కుమార్ ప్రాథమిక, సెకండరీ స్థాయి స్కూల్ కాంప్లెక్స్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 21, 22వ తేదీల్లో ప్రాథమిక స్థాయి (పీఎస్, యూపీఎస్)కి సంబంధించి రెండు విడతలుగా సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లాలో 35 స్కూల్ కాంప్లెక్స్లు ఉండగా, విద్యార్థుల బోధనకు ఎలాంటి ఆటంకం కలుగకుండా సమావేశాలకు రోజుకు 50 శాతం మంది టీచర్లు హాజరు కావాలని తెలిపారు. ఇందులో ఎస్ఏ–1 ఫలితాల సమీక్ష, పీఆర్ఎస్–2024 రిపోర్ట్ విశ్లేషణ, ఎఫ్ఎల్ఎన్ పాఠాల అమలు, 5 ప్లస్ 1 విధానం, డిజిటల్ టూల్స్ ఉపయోగం, బోధనా వ్యూహాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. అలాగే ఉన్నత, ప్రాథమికోన్నత స్థాయిలో 24వ తేదీన తెలుగు, హిందీ, ఇంగ్లిష్, 25న సామాజిక శాస్త్రం, గణితం, బయాలజీ, 26న ఫిజికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ మూడు రోజులపాటు సమావేశాలను నిర్వహించేలా ప్రణాళిక రూపొదించారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల సమయంలో వందశాతం హాజరు కావాలని విద్యాశాఖ నిబంధనలు విధించింది. అత్యవసర పరిస్థితులు మినహా, ఏ ఒక్క టీచర్కు కూడా సెలవు అనుమతి ఉండదని జీఓ లో పేర్కొన్నారు. ఎంఈఓ, హెచ్ఎం, సీఆర్పీలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు హాజరు ఉండాలనే ఖచ్ఛితమైన నిబంధన విధించారు. కాంప్లెక్స్ సమావేశాలకు హాజరయ్యే ఉపాధ్యాయుల సమాచారం, రిపోర్టులను యాప్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
వరంగల్ క్రైం : డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ కంట్రోల్ టీం ఆధ్వర్యంలో ‘సే నో టు డ్రగ్స్’ అనే నినాదంతో రూపొందించిన వాల్పోస్టర్ను సీపీ గురువారం అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల నియంత్రణలో ప్రజలు సైతం సహకరించాలని సూచించారు. ఎవరైన మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగాలకు పాల్ప డితే వెంటనే 87125 84473, 87126 85299 నంబర్లకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచనున్నట్లు సీపీ తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి, ఆర్ఐ శివకేశవులు, ఇన్స్పెక్టర్ సతీష్, ఆర్ఎస్సైలు పూర్ణచందర్ రెడ్డి, మనోజ్ రెడ్డి, నాగరాజు, ర్యాపిడో సంస్థ ప్రతినిధులు దుర్గారావు, సందీప్ పాల్గొన్నారు.


