రేవంత్ మాటలు ఘనం.. చేతలు శూన్యం
వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆయన చెప్పే మాటలు ఘనంగా ఉంటున్నాయని, చేతలు మాత్రం శూన్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు. మక్కలు, పత్తి యార్డుల్లోని రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో రైతుల పక్షపాతి ఒక్క కేసీఆర్ మాత్రమే అని, ఆయన మొట్టమొదటిసారిగా రైతుబంధు తెచ్చి రైతులను ఆదుకున్నారని అన్నారు. రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారన్నారు. సీసీఐ అడ్డమైన ఆంక్షలు పెట్టి ఆగమాగం చేస్తున్నా రేవంత్రెడ్డి లేఖలు రాస్తూ పట్టించుకోవడం లేదన్నారు. పంటలకు బోనస్ ఇస్తామని అనడమే కానీ, ఇచ్చింది లేదన్నారు. ఎల్1, ఎల్2, కపాస్ యాప్, తేమశాతం లాంటి తుగ్లక్ నిర్ణయాలతో రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచిన రేవంత్రెడ్డి పత్తి రైతులకు కనీస మద్దతు ధర అందించలేకపోతున్నారని ఆరోపించారు.
మక్క రైతులతో మాటామంతి..
అంతకుముందు అపరాల యార్డుకు వెళ్లిన హరీశ్రావు మక్కలను పరిశీలించారు. అమ్మడానికి వచ్చిన ములుగు జిల్లాకు చెందిన రైతులు వెంకటేశ్వర్లు, లక్ష్మయ్యతో ముచ్చటించారు. మక్కలను ఎంతకు అమ్మారు అని ప్రశ్నించగా రూ.1,825లకు అని సమాధానం చెప్పారు. మద్దతు ధర క్వింటాల్కు రూ.2,400లు ఉంది కదా అని అంటే.. వారు ట్రేడర్కు అమ్మామని, ఆయన వెంటనే డబ్బులు ఇవ్వడమే కాకుండా పంట వేసేందుకు ముందుగా పెట్టుబడి పెడుతున్నందున విక్రయించామని చెప్పారు. కేంద్రాల్లో కొనుగోలు చేసిన మక్కలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల మార్క్ఫెడ్ రైతులకు డబ్బులు చెల్లించలేక పోతోందని హరీశ్రావు అన్నారు. అందువల్ల క్వింటాల్కు రైతులు రూ.575లు నష్టపోతున్నా ట్రేడర్లకే అమ్ముకుంటున్నారని వాపోయారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ టి.రవీందర్రావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు దా స్యం వినయ్భాస్కర్, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఒడితల సతీష్కుమార్, నన్నపునేని నరేందర్, సరోగసి కమిటీ మాజీ సభ్యురాలు డాక్టర్ హరి రమాదేవి, ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కా కులమర్రి లక్ష్మణ్బాబు, నాయకులు పాల్గొన్నారు.
కేసముద్రం వ్యవసాయ మార్కెట్ సందర్శన
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ను తన్నీరు హరీశ్రావు సందర్శించి, రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, బోనస్ రాక, మరోవైపు యూరియా, రైతుబంధు,రైతు బీమా అందకపోవడంతో గోసపడుతున్న రైతులంతా రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం రేవంత్రెడ్డిపై శాపనార్దాలు పెడుతున్నారని విమర్శించారు. కేసముద్రం మార్కెట్లో కనీస సౌకర్యాలు లేవని, పందులు, మేకలు తిరుగుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్న సీఎం
కాంగ్రెస్ పాలనలో కరెంటు నుంచి
కాంటా దాకా సమస్యలే
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే
తన్నీరు హరీశ్రావు
వరంగల్ ఏనుమాముల మార్కెట్
సందర్శన..
రైతులతో ముచ్చటించి సమస్యలు తెలుసుకున్న మాజీ మంత్రి
రేవంత్ మాటలు ఘనం.. చేతలు శూన్యం


