హైవేపై జీరో సేఫ్టీ
ఆందోళనకు గురిచేస్తున్న
వరుస ప్రమాదాలు
కొట్టొచ్చినట్లు భద్రతా లోపాలు
పక్కకు తిరిగిన సిగ్నల్ లైట్
లారీని బస్సు ఢీకొట్టిన ఘటనలో రోడ్డు భద్రత నిర్వహణ లోపం
జనగామ: హైవేపై ‘జీరో సేఫ్టీ’ మరోసారి మృత్యుఘంట మోగించింది. నిడిగొండ ఫ్లైఓవర్కు 10 మీటర్ల దూరంలో బ్రేక్డౌన్ అయిన ఇసుక లారీ గంటసేపు రోడ్డుపైనే నిలిచిపోయింది. నేషనల్ హైవే అథారిటీ హెల్ప్లైన్ నెంబర్–1033కు డ్రైవర్ పలుమార్లు కాల్ చేసినా స్పందన రాలేదు. ఇదే సమయంలో హన్మకొండ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ రాజధాని బస్సు నేషనల్ హైవే రోడుపై నిలిచిన లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్ 100కు కాల్ చేసి ఉంటే ప్రమాదం తప్పేదని పోలీసులు భావిస్తున్నారు. ఎన్హెచ్ నిర్వహణ, లైటింగ్ లోపాలు, హెల్ప్లైన్ అలసత్వం అమాయక ప్రాణాలను పొట్టనబెట్టుకుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లారీని ఢీకొట్టే సమయంలో బస్సు వేగం 55 కిలోమీటర్లు మాత్రమే ఉన్నట్లు జనగామ డిపో మేనేజర్ స్వాతి తెలిపారు.
ప్రమాదంలో ప్రమేయం ఉన్న లారీ వాహన పత్రాలు సక్రమంగానే ఉన్నాయని జిల్లా రవాణా అధికారి జీవీఎస్ గౌడ్ తెలిపారు. అయితే ఓవర్లోడ్ ఉందా లేదా అనే విషయం తూకం వేసిన తర్వాత నిర్ధారణ జరుగుతుందన్నారు. ఇసుక లారీ ఫ్లైఓవర్ దిగిన వెంటనే బ్రేక్డౌన్తో ఆగిపోవడంతో ఎన్హెచ్ హెల్ప్లైన్ నెంబర్కు డ్రైవర్ ఫోన్ చేసినా, అక్కడ నుంచి రెస్పాన్స్ రాలేదని చెప్పినట్లు స్పష్టం చేశారు.
నేషనల్ హైవేపై వాహనాలు ఆగిన వెంటనే హెల్ప్లైన్ సెంటర్లు స్పందించాల్సి ఉంటుంది. కానీ వరంగల్–హైదరాబాద్ హైవేపై అలాంటి చర్యలు కనిపించడం లేదు. రిపేరు, బ్రేక్డౌన్, తదితర కారణాలతో వాహనాలు రోడ్డుపై నిలిచిన సమయంలో తొలగించే టీంలు కనిపించడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. చిన్న పెండ్యాల నుంచి జనగామ పెంబర్తి వరకు అనేక చోట్ల ఫ్లడ్లైట్లు వెలగడం లేదు.
ఇటీవల కాలంలో బస్సుల ప్రమాదాలు పెరిగిపోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. అన్ని ప్రమాదాలకూ రహదారి భద్రతా లోపాలే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రఘునాథపల్లి శివారు టిఫిన్ సెంటర్లోకి బస్సు దూసుకొచ్చిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మండల కేంద్రం శివారు పెట్రోలు బంకు వద్ద కారు–బస్సు ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డారు. ఖిలాషాపూర్ రోడ్డు సమీపంలో స్కూల్ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో త్రుటిలో ప్రమాదం తప్పింది. జనగామ శివారు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం సమీపంలో బెంగుళూరు నుంచి వచ్చే ట్రావెల్ బస్సు టైరు పేలి అదుపుతప్పి పల్టీకొట్టిన ఘటనలో 20మందికి పైగా గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బస్సు, లారీ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇప్పటివరకు 22 మందికి పైగా చనిపోయారు.
నిడిగొండ శివారులో లారీ–రాజధాని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన హైవే భద్రతలో ఉన్న లోపాలను మరోసారి బట్టబయలు చేసింది. హైవే అథారిటీ నిర్లక్ష్యం, హెల్ప్లైన్ స్పందన లేకపోవడం, లైటింగ్ సౌకర్యాల లేమి ఇవన్నీ ప్రమాదానికి కారణాలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఫ్లైఓవర్ కిందకు దిగగానే అర్ధరాత్రి 12 గంటల సమయంలో లారీ బ్రేక్డౌన్ కావడంతో రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో డ్రైవర్ మల్లేశం వెంటనే నేషనల్ హైవే హెల్ప్ లైన్కు పలుమార్లు కాల్ చేసినా రెస్పాన్స్ రాలేదు. గంటసేపు ఎలాంటి సహాయం అందకపోవడంతో లారీ రహదారి పైనే నిలిచిపోయింది. ఇదేక్రమంలో రాత్రి 1.05 గంటలకు బస్సు రావడం, ఢీకొట్టడం జరిగింది. మలుపుగా ఉన్న ఫ్లైఓవర్ దిగే సమయంలో లారీ అగిఉన్న విషయం బస్సు డ్రైవర్ ఎందుకు గమనించలేదనే విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ 50 మీటర్ల దూరంలో పసిగట్టి బ్రేక్లు వేసినా సడెన్గా అపలేకపోయారా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఫ్లైఓవర్ సమీపంలో బ్రేక్డౌన్తో లారీ అగిపోయిన సమయంలో సదరు డ్రైవర్ కనీస ప్రమాద హెచ్చరిక ప్రికాషన్ తీసుకోకపోవడం సైతం తప్పిదంగానే భావిస్తున్నారు. హెల్ప్లైన్ స్పందించకపోవడమే విషాదానికి కారణంగా ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
1033 హెల్ప్లైన్ స్పందన
లేకపోవడమే ప్రమాదానికి కారణం
100కు కాల్ చేస్తే ప్రమాదం
తప్పేదంటున్న అధికారులు
ఢీకొట్టే సమయంలో బస్సు స్పీడ్ 55 కిలోమీటర్లు
ఎన్హెచ్ నిర్వహణపై సర్వత్రా విమర్శలు
ప్రమాదం జరిగిన ప్రాంతంలోని యూటర్న్ దగ్గర సిగ్నల్ లైట్ ఒక వైపుకు తిరిగి ఉండడంతో డ్రైవర్లకు స్పష్టంగా కనిపించే పరిస్థితి లేకుండాపోయింది. హైవేపై చాలాచోట్ల స్ట్రీట్ లైట్లు వెలగకపోవడం, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోకపోవడం, రాత్రివేళ రక్షణ చర్యలు శూన్యంగా మారాయి.
హైవేపై జీరో సేఫ్టీ
హైవేపై జీరో సేఫ్టీ
హైవేపై జీరో సేఫ్టీ


