క్రీడలతో మానసిక వికాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసిక వికాసం

May 2 2025 1:13 AM | Updated on May 2 2025 2:34 PM

జనగామ రూరల్‌: యువతకు విద్యార్థులకు క్రీడలతో మానసిక, శారీరక వికాసం కలుగుతుందని జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చౌడారంలో స్థానిక జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో క్రీడల శాఖ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్‌ వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారులు వేసవి శిక్షణ శిబిరాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర జాతీయ స్థాయి అథెటిక్స్‌లో పాల్గొనేలా నైపుణ్యాలు నేర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి గంగిశెట్టి మనోజ్‌కుమార్‌, శిక్షకులు మునిగె సురేశ్‌, గ్రామస్తులు కర్ణాకర్‌, కర్ల శ్రీకాంత్‌రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

కార్మికులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

జనగామ రూరల్‌: కార్మికులు హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి సి.విక్రమ్‌ అన్నారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా జడ్జి విక్రమ్‌ మాట్లాడుతూ.. కార్మికుల హక్కులు, వారికి సంబంధించిన చట్టాలు, ఆరోగ్య పథకాల గురించి తెలుసుకోవాలన్నారు. కార్మికులు పనిచేస్తున్న ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. లేబర్‌ కార్డు, ఇన్సూరెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆటోడ్రైవర్లు, పెయింటర్స్‌, చిరు వ్యాపారస్తులు, మెకానిక్‌లు, వడ్రంగులు, సోషల్‌ వర్కర్స్‌, ఐటీఐ విద్యార్థులు, పారా లీగల్‌ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీలకు చరిష్మ

జఫర్‌గఢ్‌: మండలంలోని హిమ్మత్‌నగర్‌ గ్రామానికి చెందిన విద్యార్థి తాటికాయల చరిష్మ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) బాక్సింగ్‌ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలంగాణ రాష్ట్ర బాక్సింగ్‌ ఆర్గనైజర్‌ సెక్రటరీ శీలం పార్థసారధి గురువారం తెలిపారు. హిమ్మత్‌నగర్‌కు చెందిన చరిష్మ మడికొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతోందని.. రెండేళ్ల నుంచి హైదరాబాద్‌లోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ పాఠశాల బాక్సింగ్‌ అకాడమీలో కోచ్‌ కృష్ణ తాప దగ్గర ప్రత్యేక శిక్షణ పొందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్‌ 30 నుంచి 5వ తేదీ వరకు న్యూఢిల్లీలో ఛత్రసల్‌ స్టేడియంలో 68వ (ఎస్‌జీఎఫ్‌) జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈపోటీల్లోనూ ప్రతిభను కనబర్చి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన కోరారు. కాగా.. విద్యార్థిని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ ఉమా మహేశ్వరి, ఫిజికల్‌ డైరెక్టర్‌ పద్మ, పీఈటీ సరిత, రమేశ్‌, శాంసన్‌ అభినందించారు.

‘యువ వికాసం’ పత్రాలు అందజేయాలి..

జనగామ రూరల్‌: రాజీవ్‌ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు దరఖాస్తు పత్రాలను సంబంధిత కార్యాలయంలో అందించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతం వారు మండల ప్రజాపాలన కేంద్రాల్లో, పట్టణ ప్రజలు మున్సిపల్‌ కార్యాలయంలో ఈనెల 3 వతేదీ సాయంత్రం 5 గంటల్లోపు అందజేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement