
బరిగీసి కొట్లాడిన జనగామ
జనగామ: రజాకార్ల అరాచకాలు..గడీల పాలనపై తిరుగుబాటు చేసి... దున్నేవాడికే భూమి అంటూ ఎదురొడ్డి పోరాడిన జనగామ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన తొలి, మలిదశ ఉద్యమంలో బరిగీసి కొట్లాడింది. పోలీసుల లాఠీలు, నిర్భందా లను సైతం లెక్క చేయకుండా సకల జనులు రోడ్లపైకి వచ్చి ఢిల్లీ కోటలు బద్దలయ్యేలా నినదించారు. తల్లి తెలంగాణ కోసం పండు ముసలి నుంచి పడచు యువకుడి వరకు పోరుబాటలో నేను సైతం అంటూ ముందుకు కదిలారు. రాస్తారోకోలు, ధర్నాలతో ఆనాటి ఉమ్మడి పాలకులు గడగడలాడించారు. జైలుకై నా వెళ్తాం.. ప్రాణాలైనా ఇస్తాం అంటూ పో లీసుల తూటాలకు ఎదురొడ్డి జనగామ గడ్డ పౌరుషాన్ని చూపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
చరిత్రలో మరచిపోలేని ఘటనలు
ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన మలిదశ ఉద్యమ చరి త్రలో మరచిపోలేని ఎన్నో ఘటనలు నేటికి గుర్తుకు చేస్తూనే ఉంటాయి. బచ్చన్నపేట మండలం మన్సాన్పల్లి గ్రామానికి చెందిన పొన్నం అశోక్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉరితాడును ముద్దాడాడు. దీంతో ఉద్యమకారులు రగిలి పోయారు. అశోక్ నుంచి మొదలుకుని అనేక గ్రామాల్లో ఆత్మహత్యలు, ప్రయత్నాలు జరుగుతూనే వచ్చా యి. ఈ ఘటనలో ఎందరో యువకులు బలిదానాలయ్యారు. అప్పటి వరకు ర్యాలీలు, ధర్నాలతో, రిలే దీక్షలతో అట్టుడికి పోతున్న ఉద్యమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాహనాలను దహనం చేయడంతో పాటు ధ్వంసం చేశారు. రోజుల తరబడి రోడ్లను బ్లాక్ చేసి పాలకులకు అల్టి మేటం జారీ చేశారు. 2001లో మొదలైన 144 సెక్షన్ తెలంగాణ ఆవిర్భావం 2014 వరకు కొనసాగింది. జనగామ, బచ్చన్నపేట, లింగాలఘణపురం, దేవరుప్పుల, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి ఇలా ప్రతీ మండలంలో ఏళ్ల తరబడి రిలే దీక్షలు కొనసాగాయి.
బరిగీసి కొట్లాడిన విద్యాలోకం
ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం 2009 చివరి అంకంలో తారా స్థాయికి చేరుకుంది. విద్యార్థులు, యువ త ఒక్కసారిగా గర్జించారు. వేలాది ర్యాలీలు చేస్తూ గంటల తరబడి రోడ్లపై బైఠాయించారు. రేపటి భవిష్యత్ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇలా ప్రతిఒక్కరిని అడ్డుకుని ముందుకు కదలనివ్వలేదు. వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ, దాడులకు సైతం వెనకాడలేదు. ఆంధ్ర పేరుతో ఉన్న కార్యాలయాల బోర్డులను మార్చేశారు. సర్కారు బోర్డులపై తెలంగాణ పేరుతో ముందే స్వరాష్ట్రాన్ని ప్రకటించుకున్నారు.
దేశం మొత్తం వినిపించేలా..
తెలంగాణ ఉద్యమాన్ని దేశం మొత్తం వినిపించేలా కొత్త తరహా నిరసనలకు శ్రీకారం చుట్టారు. జనగామ జిల్లా పరిధిలోని రైల్వే ట్రాక్పై బైఠాయింపు, గొర్లమందలు, గేదెలను వదిలి రాకపోకలకు ఇబ్బందులు కలిగించడంతో ఒక్కసారిగా దేశం ఇటువైపు చూసింది. ఉద్యమకారులపై సైతం రైల్వే పోలీసులు కేసులు నమోదు చేసినా వెనక్కి తగ్గలేదు. దీనికి తోడు కేసీఆర్, హరీష్రావు, కోదండరామ్ ఇలా ఉద్యమ నేతల సభలు ప్రజల్లో చైతన్యం కలిగించా యి. సకల జనులు రోడ్లపైకి వచ్చి వంటావార్పు, బోనాలు, బతుకమ్మ ఆటలతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటుతూ నిరసన తెలిపారు. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో ‘జనగామ’ స్ఫూర్తి ప్రస్తుత 32 జిల్లాలను కదిలించిందని ఆనాటి మేధావులు అనేక ప్రసంగాల్లో చెబుతూ వచ్చారు.
చరిత్రలో మరచిపోలేని ఘటనలు
దశాబ్దంన్నర పాటు 144 సెక్షన్
తొలి, మలిదశ ఉద్యమంలో ముఖ్యపాత్ర
కోర్టుచుట్టూ తిరుగుతున్న ఉద్యమకారులు
కోర్టు చుట్టూ తిరుగుతున్న ఉద్యమకారులు
తెలంగాణ కోసం 14 ఏళ్ల పోరాటం...స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరి 12 ఏళ్లు గడిచి పోతున్నా ఆనాటి ఉద్యమకారుల్లో పలువురు నేటికి కో ర్టు చుట్టూ తిరుగుతున్నారు. నాలుగున్నర కో ట్ల ప్రజల కోసం పోరాడి, తమ భవిష్యత్ను ఫణంగా పెట్టిన ఉద్యమకారులకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కోర్టుల చుట్టూ తిరగక తప్పడం లేదు. స్వరాష్ట్ర పాలకులు, అధికారులు కరుణించి అప్పటి కేసుల నుంచి విముక్తి కలిగించాలని బచ్చన్నపేట మండలం కట్కూర్కు చెందిన మూసిన బాబుగౌడ్ కోరుతున్నారు.