
ఆర్థిక బలోపేతమే లక్ష్యం
‘ఉపాధి’ పనుల ఎంపికలో మార్పులు
● తగ్గనున్న పూడికతీత పనులు
● గ్రామ పంచాయతీ, అంగన్వాడీ
భవన నిర్మాణాలకు ప్రాధాన్యం
● నీటి సంరక్షణలో 15 రకాల పనులు
● జిల్లా వ్యాప్తంగా 2.31లక్షల కూలీలు
● ఈఏడాది 28 లక్షల పనిదినాలు
జనగామ రూరల్: గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనుల ఎంపికలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మట్టి పనులను పూర్తిగా తగ్గించి కూలీలు ఆర్థికంగా బలోపేతం అయ్యే పనులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 28 లక్షల పనిదినాలుగా ప్రణాళిక ఖరారు చేశారు. ప్రధానంగా బిల్డింగులు, ఇతర నిర్మాణాలు చేపట్టనున్నారు. గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణం, అంగన్వా డీ కేంద్రాలకు నూతన భవనాలు, సీసీ రోడ్లు, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం, కిచెన్ షెడ్లు, పాఠశాలలకు ప్రహరీల నిర్మాణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తగ్గనున్న పూడికతీత పనులు
ఉపాధి పథకంలో ఎక్కువగా చెరువు పూడికతీత పనులు చేపడుతుంటారు. ఈ పనుల పేరుతో ఏటా రూ.కోట్లలో నిధులు ఖర్చవుతున్నా ఆశించిన మేర ఫలితాలు కనిపించడం లేదు. మరోవైపు ఈ పనులు అక్రమార్కులకు మరింత లాభం చేకూరేలా ఉన్నాయి. సోషల్ ఆడిట్లోనూ తరచూ ఇవి బయటపడుతున్నాయి. నిరుపేద కూలీల పేరుతో రూ.లక్షల్లో నిధులు పక్కదారిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉపాధి పనుల ఎంపికలో మార్పులు చేసి ప్రజలకు ఉపయోగపడే వాటికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా పూడికతీత పనులను చాలా వరకు తగ్గించారు.
ప్రాధాన్యత పనులకు లక్ష్యాలు
ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనులకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించారు. జిల్లా వ్యాప్తంగా 27 గ్రామ పంచాయతీలకు భవన నిర్మాణాలు, 54 అంగన్వాడీ కేంద్రాల భవనాలు, 54 చోట్ల పాఠశాలల కిచెన్ షెడ్లు, ప్రహరీలు నిర్మించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ మేరకు పనుల ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో లింకు రోడ్లకు కూడా ఉపాధి నిధులను కేటాయించనున్నారు.
2,31లక్షల మంది కూలీలు
గ్రామీణ ప్రాంత నిరుపేద కూలీలకు స్థానికంగా పనులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోని 281 గ్రామాల్లో పనులు నడుస్తున్నా యి. మొత్తం 1,17,806 లక్షల జాబ్కార్డులు ఉండగా.. 2.34 లక్షల మంది కూలీలు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో ఉపాధి పనులకు రెగ్యులర్గా వెళ్లే కూలీల సంఖ్య 1.28 లక్షలు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 50 రోజుల్లో రూ.20కోట్ల విలువైన పనులు చేపట్టారు.
నీటి సంరక్షణ పనులు
ఈసారి ఉపాధి హామీ పథకంలో నీటి సంరక్షణ ప నులు కూడా చేపట్టనున్నారు. అలాగే వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రధానంగా చెక్ డ్యాంలు, పర్కులేషన్ ట్యాంకులు, ఓపెన్వెల్స్, ఫాంపాండ్లు, వాటర్ హార్వెస్టింగ్ పాండ్లు, రూఫ్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు, బోర్వెల్ రీచార్జ్ కట్టడాలు తదితర 15 రకాల పనులను ఈసారి కూడా ఉపాధి పథకంలో చేపట్టనున్నారు.
ఒక్కో మండలంలో చేపట్టనున్న పనులు ఇలా..
క్యాటిల్ షేడ్స్ 20, అజొల్లా 20, వర్మికంపోస్ట్ 10, పౌల్ట్రీ షెడ్లు 20, అగ్రికల్చర్ రోడ్డులు(10 కిలోమీటర్లు)
హార్టికల్చర్ ప్లాంటేషన్ 10 ఎకరాలు,
ఫాంపాండ్లు 40, పర్కులేషన్ ట్యాంకులు 5
చెక్డ్యాంలు 2, రూఫ్టాప్ వాటర్
హార్వెస్టింగ్ 10, బోర్వెల్ రీచార్జ్ 10,
ఇరిగేషన్ ఓపెన్ వెల్స్ 2, కమ్యూనిటీ సోక్ కిట్స్ 40, ప్రభుత్వ కార్యాలయాల్లో రోప్ టాప్ రీచార్జ్ స్ట్రక్చర్లు 25, వ్యక్తిగత మరుగుదొడ్లు 200 నుంచి 300.
పీఆర్ డిపార్ట్మెంట్ ద్వారా సీసీ రోడ్డులు(10 కిలోమిటర్లు), అంగన్వాడీ కాంపౌండ్ వాల్స్ 2, మండలాల్లో సొంత జీపీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలె ట్లు లేని వాటికి ఏర్పాటు చేయనున్నారు.
భవన నిర్మాణాలకు ప్రాధాన్యం
ఈ ఏడాది ఉపాధి హామీ పనుల్లో ప్రభుత్వం కొత్తగా పనులను ఎంపిక చేసింది. గతంలో పూడికతీత, ఇంకుడు గుంతలకు ఎక్కువ అవకాశం కల్పించగా.. ప్రస్తుతం భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా జీపీ భవనాలు, మండలానికి రెండు చెక్డ్యాంలు, నీటి సంరక్షణ పనులు, పాఠశాల కాంపౌండ్ వాల్స్, అంగన్వాడీ భవనాల నిర్మాణం చేపట్టనుంది. దినసరి కూలి రూ.307 ఉంది. ఉపాధి పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలి.
– వసంత, డీఆర్డీఓ

ఆర్థిక బలోపేతమే లక్ష్యం

ఆర్థిక బలోపేతమే లక్ష్యం