జగిత్యాల క్రైం: తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎస్పీ మాట్లాడుతూ.. శాంతియుత వాతావరణంలోనే సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు. సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా ఉంటూ.. సాధారణ ప్రజలకు భరోసా కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం అమరువీరుల స్తూపానికి నివాళి అర్పించారు. డీఎస్పీలు పురుషోత్తంరెడ్డి, రాములు పాల్గొన్నారు.
కొండగట్టులో భక్తుల రద్దీ
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి ఆర్టీవోలు శ్రీనివాస్, రవీంద్రకుమార్, రంజిత్, ఎంవీఐలు మార్గం రవీందర్, కోల రవీందర్, కిశోర్ రెడ్డి, అభిలాష్ స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు తీర్థ, ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
దరఖాస్తులు ఆహ్వానం
జగిత్యాల: జిల్లాలో కొత్తగా ప్రారంభించనున్న 69 ప్రీప్రైమరీ పాఠశాలల్లో టీచర్లు, ఆయాల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాము తెలిపారు. 69 టీచర్లు, 69 ఆయా పోస్టులున్నాయని, టీచర్ పోస్టులకు ఇంటర్ అర్హత అని, నెలకు రూ.8వేల వేతనం, ఆయా పోస్టులకు ఏడో తరగతి అర్హత అని, నెలకు రూ.6వేల వేతనం ఉంటుందని తెలిపారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు మాత్రమే అర్హులని, ఈనెల ఆరో తేదీ సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. ఈనెల 7, 8 తేదీల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు.
ఉద్యోగుల ఆశ నిరాశ
జగిత్యాల: పీఆర్సీ, పెండింగ్ డీఏలపై ముఖ్యమంత్రి ప్రకటన చేయకపోవడంతో ఉద్యోగుల ఆశ నిరాశ అయిందని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బైరం హరికిరణ్, శివరామకృష్ణ అన్నారు. సంఘం కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల త్యాగాల ఫలితమే రాష్ట్రమని, నిరుద్యోగం దూరమవుతుందని, జీవితాలు మెరుగుపడతాయని ఆశపడితే నిరాశే ఎదురైందన్నారు. మూలవేతనంలో 1.5 శాతం కోత విధించడం సరికాదన్నారు. నెల జీతంలో ఉచిత కోత విధిస్తూ ఉచిత ఆరోగ్య కార్డులని ప్రచారం చేయడం సరికాదన్నారు. ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చ శంకర్ మాట్లాడుతూ స్వయాన సీఎం పీఆర్సీ నివేదిక తెప్పించుకుని అమలు చేస్తామన్నారని గుర్తు చేశారు. ఉద్యోగుల సంక్షేమ బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. కార్యక్రమంలో నాయకులు మేకల ప్రవీణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
బహ్రెయిన్లో ఆవిర్భావ వేడుకలు
రాయికల్: బహ్రెయిన్ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అండాలస్ గార్డెన్లో మంగళవారం ఘ నంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితమే తెలంగాణ రాష్ట్రమన్నారు. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి, జనరల్ సెక్రటరీలు అన్నారం సుమన్, చెన్నమనేని రాజేందర్, కార్యదర్శుల సంగేపు దేవన్న, సంకోజీ రాణాప్రతాప్, ప్రమోద్, వంశీ, రా ము, కస్తూ రి కిరణ్, నర్సింహచారి పాల్గొన్నారు.


