జగిత్యాల: మతాల పేరుతో రాజకీయాలు చేస్తే ఫలితాలు శూన్యమని, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ అన్నారు. మంగళవారం జగిత్యాలలోని మోతె పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 1969 నుంచి మొదలుకుని అనేక ఉద్యమాలు చేపట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. క్రికెటర్గా కెరీర్ ప్రారంభించి రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు. సీఎం రేవంత్రెడ్డి రైజింగ్ తెలంగాణ పేరుతో ముందుకు సాగుతూ మంచి పేరు తీసుకొస్తున్నారని చెప్పారు. జిల్లాలోని మైనార్టీ సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. ఈద్గా, ఖబ్రస్థాన్ ఏర్పాటుపై కలెక్టర్తో మాట్లాడతానన్నారు. మైనార్టీ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు అంతర్జాతీయస్థాయికి ఎదిగేలా కృషి చేస్తానన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ.. అజారుద్దీన్ క్రీడాకారుడిగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొంది రాజకీయాల్లోకి రావడం చాలా సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయని అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మంత్రులు, ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు.


