జగిత్యాల/జగిత్యాలటౌన్: హనుమాన్ చిన్న జయంతి కావడంతో ప్రజాపాలన దినోత్సవాన్ని వాయిదావేయాలని హిందూ ఐక్యవేదిక ప్రతినిధులు మంత్రి అడ్లూరిని కోరారు. మంత్రికి బుధవారం వినతిపత్రం అందించారు. గురువారం జయంతి నేపథ్యంలో కార్యక్రమం నిర్వహిస్తే ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక నాయకులు లింగంపేట శ్రీనివాస్, చీటి చంద్రశేఖర్రావు, జిట్టవేని అరుణ్, బిట్టు, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పురిట్లోనే శిశువుకు గాయాలు
మెట్పల్లి:ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో తమ బిడ్డకు గాయాలయ్యాయని ఉదయ్ అనే వ్యక్తి ఆరోపించాడు. పట్టణంలోని వెంకట్రావ్పేటకు చెందిన భవానీని గత నెల 29న ప్రసవం కోసం కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు అదేరోజు శస్త్ర చికిత్స చేసి పురుడు పోశారు. పుట్టిన శిశువు ఓ చేయి వాపుతోపాటు పలు చోట్ల గాయాలు ఉండడాన్ని గమనించిన తండ్రి ఉదయ్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. అందులో చేయి విరిగిందని తేలడంతో అందోళన చెందిన ఆయన ప్రభుత్వ వైద్యులను నిలదీశాడు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువుకు గాయాలయ్యాయని, బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
కమిషనర్పై కలెక్టర్కు ఎమ్మెల్యే ఫిర్యాదు
కోరుట్ల: కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్పై ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఫోన్ ద్వారా కలెక్టర్ సత్యప్రసాద్కు ఫిర్యాదు చేశారు. కమిషనర్ తమకు కనీస మర్యాద ఇవ్వడం లేదని, ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోవడం లేదని, జవాబుదారీతనం లేకుండా పోయిందని పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన కలెక్టర్కు ఫోన్ చేసి కమిషనర్ తీరు విచారకరమని, ప్రజాప్రతినిధుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం సరికాదని చెప్పారు. ఆస్తి పన్ను కోసం పేదల ఇంటి కరెంట్ కట్ చేసి ఇబ్బందికి గురిచేశారని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎమ్మెల్యేకు చెప్పినట్లు సమాచారం.


