కరెంట్షాక్తో రైతు నాయకుడు మృతి వీర్నపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రానికి చెందిన రైతు నాయకుడు, సీపీఐ జిల్లా రైతు విభాగం కార్యదర్శి జంగం అంజయ్య(55) సోమవారం విద్యుత్షాక్తో మృతి చెందాడు. తన పొలం వద్ద పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్షాక్కు గురయ్యాడు. సమీపంలోని రైతులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఎస్సై లక్ష్మణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంజయ్య 20 ఏళ్ల పాటు జనశక్తి సానుభూతిపరుడిగా పనిచేసి, జనజీవన స్రవంతిలో కలిశారు. నాటక రంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు.
వీర్నపల్లిలో పట్టపగలే చోరీ వీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి మండల కేంద్రంలో దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి భారీగా నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. బాధితుడు తెలిపిన వివరాలు. మండల కేంద్రంలోని వడ్లూరి రాజం ఇంట్లోకి సోమవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. బీరువాలో భద్రపరిచిన రూ.2లక్షలు, రెండు బంగారు పుస్తెలు, వెండి గొలుసులు, ఆరు తులాల బంగారు ఆభరణాలతోపాటు ఇతర విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుడు రాజం ఫిర్యాదుతో ఎస్సై వేముల లక్ష్మణ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలో శనివారం రాత్రి బాలాజీనగర్కు చెందిన తుమ్మల లోకేశ్పై హత్యాయత్నానికి పాల్పడిన ఓరుగంటి వివేక్ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. తహసీల్ చౌరస్తా వద్దనున్న అమృత విల్లాస్ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న లోకేశ్, అదే హోటల్లో మేనేజర్ వివేక్ మధ్య గొడవ జరిగింది. మాటామాట పెరగడంతో లోకేశ్ను చంపాలనే ఉద్దేశంతో తన వద్దనున్న సర్జికల్ బ్లేడ్తో వీపుపై పొడవగా బలమైన రక్తగాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.
ఎస్సారెస్పీ కాలువలో దూకి మహిళ ఆత్మహత్య
మేడిపల్లి: మండలంలోని వల్లంపల్లి పరిధి ఎస్సారెస్పీ కాలువలో దూకి మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన సార్ల లక్ష్మీ ఆత్మహత్య చేసుకుంది. కాలువలోని తుమ్మచెట్టుకు మహిళ మృతదేహం కనిపించిందన్న బాటసారుల ద్వారా తెలుసుకున్న మేడిపల్లి పోలీస్లు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. లక్ష్మీ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోందని, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త నారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.