● కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలి ● సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు సులోచన
జగిత్యాలటౌన్: ఆశా కార్యకర్తలకు రూ.18వేల ఫిక్స్డ్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు ఇందూరి సులోచన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జగిత్యాల కొత్తబస్టాండ్లోని పటేల్చౌక్లో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్బంగా సులోచన మాట్లాడుతూ అర్హత కలిగిన ఆశాలకు ఏఎన్ఎంగా పదోన్నతి కల్పించాలన్నారు. 2023లో 15 రోజుల సమ్మె సందర్భంగా హెల్త్ డైరెక్టర్ ఇచ్చిన హామీలతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5లక్షలు చెల్లించాలన్నారు. లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశావర్కర్స్ యూనియన్ నాయకులు రాయికంటి దివ్య, ప్రేమలత, బత్తిని వసంత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


