మెట్పల్లి: పట్టణంలోని ఆర్టీసీ ఇన్గేట్ వద్ద బుధవారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. హనుమాన్ దీక్షాపరులు పారాయణం చేశారు. గేట్ పక్కనున్న హనుమాన్ ఉత్సవ విగ్రహాన్ని అక్కడి నుంచి పక్కనే మరోచోట ఏర్పాటు చేసి పూజ లు చేశా రు. డిపో మేనేజర్ సరస్వతీ సిబ్బంది తో కలిసి అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఉద్రికత్తకు దారి తీసింది. బస్సుల ప్రవేశానికి ఇబ్బందులు కలగకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, సహకరించాలని డీఎంను కోరారు.
మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి
మెట్పల్లిరూరల్: జగ్గాసాగర్లో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మార్క్ఫెడ్ ఎగ్జిక్యూటివ్ అధికారి శ్రీనివాస్కు సర్పంచ్లు, రైతులు బుధవారం వినతిపత్రం అందించారు. జగ్గాసాగర్లో కేంద్రం ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఇబ్బందులుండవ న్నారు. సర్పంచ్లు జగన్, తిరుపతి, కాంగ్రెస్ నాయకుడు విజయ్, రైతులు రాజారెడ్డి, అంజయ్య, లింగం, రాజేశ్, మల్లేశ్ పాల్గొన్నారు.
ఐస్క్రీం అమ్మితే రూ.ఐదువేల జరిమానా
● గ్రామాల్లో వెలుస్తున్న ఫ్లెక్సీలు
● తీర్మానిస్తున్న పాలకవర్గాలు
మెట్పల్లిరూరల్: గ్రామాల్లో ఐస్క్రీం విక్రయాలపై పంచాయతీలు వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గతంలో బెల్ట్షాపులు, ప్లాస్టిక్ నిషేధంపై తీర్మానాలు చేసిన పాలకవర్గాలు.. తాజాగా ఐస్క్రీం విక్రయాలను నిషేధిస్తున్నాయి. మెట్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఐస్క్రీం విక్రయాలు చేపట్టవద్దంటూ పాలకవర్గాలు తీర్మానించాయి. నిబంధనలు అతిక్రమిస్తే రూ.ఐదు వేల జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నాయి. దీనంతటికీ కారణం ఐస్క్రీం నాణ్యతపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొనడమే. ఇప్పటికే మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్, వెల్లుల, వేంపేటలో ఐస్క్రీం బండ్లపై నిషేధం విధించారు. గ్రామంలో ఐస్క్రీం బండ్లకు అనుమతిలేదని, అమ్మితే జరిమానా విధిస్తామని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చాలాచోట్ల సొంతంగా ఐస్క్రీంలు తయారుచేసి విక్రయిస్తున్నారని, వాటిలో నాణ్యత లేక పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని పాలకవర్గాలు, ,గ్రామపెద్దలు చెబుతున్నారు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది.
కొండగట్టు టెండర్లు మరోసారి వాయిదా
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ టెండర్లు మరోసారి వాయిదాపడ్డాయి. బుధవారం కరీంనగర్లోని దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో టెండర్లు నిర్వహించగా.. ఎవరూ దరఖాస్తు చేయకపోవడంతో వాయిదా వేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 30న తిరిగి కొండగట్టులో టెండర్లు నిర్వహించనున్నట్లు ఆలయ పర్యవేక్షణ అధికారి సునీల్కుమార్ తెలిపారు.
వైద్య ఉద్యోగి శ్రీధర్ సెక్షన్ మార్పు
జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలోని మాతాశిశు ఆస్పత్రిలో నర్సింగ్ ఆఫీసర్ నవీన ఏయిమ్స్లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన ఎన్వోసీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్పై ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపిన ఆరోగ్య శాఖ అధికారులు ఎన్వోసీ జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన శ్రీధర్ సెక్షన్ మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


