● ప్రజలు ఆందోళన చెందవద్దు ● టోల్ఫ్రీ నంబరు 1800 2333 555 ● ‘సాక్షి’తో పౌరసరఫరాల శాఖ అధికారి ఎస్.జితేందర్రెడ్డి
జగిత్యాల: జిల్లాలో గ్యాస్, పెట్రోల్, డీజీల్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎస్.జితేందర్రెడ్డి అన్నారు. ప్రజలు అవసరాన్ని మించి తీసుకోవడంతో ఇబ్బందులు తలెత్తుతాయని, ఏజెన్సీలు, పెట్రోల్ బంక్ నిర్వాహకులు డబ్బాలు, ఇతర బాటిళ్లలో పెట్రోల్ పోయొద్దని ఆదేశాలు ఇచ్చామన్నారు. జిల్లాలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు.
పుకార్లతోనే పెట్రోల్ కోసం బారులు..
పెట్రోల్బంక్ల్లో బారులు తీరుతున్నట్లు సమాచారం వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు లైన్ కడుతున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తోంది. దీంతో వాహనదారులు అవసరానికి మించి తీసుకెళ్తున్నా రు. ఫుల్ ట్యాంక్ చేయించాలని వాహనదారులు ఒత్తిడి తెస్తే వారికి అవసరం మేరకు పెట్రోల్ పోయాలని ఆదేశాలిచ్చాం. వాస్తవానికి జిల్లాలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలున్నాయి. కావాలని కొందరు చేస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నాం.


