జగిత్యాలజోన్: జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈనెల 28 న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో సివిల్, క్రిమినల్, కుటుంబ సమస్యల కేసుల పరిష్కారాని కి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి తెలిపారు. జిల్లా కోర్టులో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. అన్నదమ్ముళ్లు, అక్కాచెళ్లెళ్లు, భార్యాభర్తలు, తండ్రీకొడుకులు చిన్నచిన్న సమస్యలకు కోర్టు మెట్లు ఎక్కుతున్నారని, అలా పేరుకుపోయిన సమస్యలు గుర్తించి, ఇరువర్గాలతో మాట్లాడి వారిని తిరిగి ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మోటార్ వాహనాల కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించేందుకు ఇన్సూరెన్సు సంస్థలు, న్యాయవాదులతో మాట్లాడామన్నారు. రూ.2లక్షల లోపు చెక్ బౌన్స్ కేసులకు మోక్షం కలిగించనున్నట్లు వివరించారు. రాజీ చేసుకోదగిన ప్రతి కేసు పరి ష్కారం అయ్యేలా పోలీసులతో సమావేశం నిర్వహించామన్నారు. గతంలో జిల్లాలో 17,500 కేసులు పెండింగ్లో ఉంటే.. వాటిని 16,844కు తగ్గించామన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి నారాయణ, న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వెంకటమల్లిక్ సుబ్రహ్మాణ్య శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
రాజీతో కేసులు పరిష్కరించుకోండి
జగిత్యాలక్రైం: పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించుకోవాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. క్రిమినల్, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్బౌన్స్, డ్రంకెన్ డ్రైవ్తోపాటు చిన్నచిన్న కేసులు పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. పోలీస్ అధికారులు రాజీ పడదగిన కేసులను గుర్తించి.. ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి రాజీ కుదుర్చాలన్నారు.


