దయచూపని నిర్మలమ్మ
సింగరేణి కార్మికులకు పన్ను మినహాయింపుపై రాని స్పష్టత ప్రసాద్ స్కీంలో ఎంపికవని వేములవాడ, కొండగట్టు రైల్వే కేటాయింపులపై స్పష్టతకు మరింత సమయం జనాభా 5 లక్షలు దాటిన నగరాల్లో కరీంనగర్
ఉమ్మడి జిల్లాకు దక్కని ప్రత్యేక హామీలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
కేంద్రప్రభుత్వం ఆదివా రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026–27లో ఉమ్మడి జిల్లాకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ఉమ్మడి జిల్లాకు చెందిన రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు కేటాయింపులపై ఎలాంటి ప్రత్యేక ప్రకటనలు రానప్పటికీ.. నేడో, రేపో వాటిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్దది. అలాంటి ప్రాజెక్టుకు కేటాయింపులపై ప్రకటన రాలేదు. అదే సమయంలో ప్రతిష్టాత్మక రాఘవాపురం–మణుగూరు, హసన్పర్తి – కరీంనగర్, నిజామాబాద్ – కరీంనగర్ – పెద్దపల్లి డబ్లింగ్, పెద్దపల్లి బైపాస్ రైల్వేలైన్ వర్క్స్ కేటాయింపులపై ఉమ్మడి జిల్లా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. పింక్ బుక్ విడుదల ఈసారి లేకపోవడంతో నిధుల కేటాయింపుపై ఇప్పటివరకు తమకు సమాచారం లేదని, తాము కూడా కేంద్ర రైల్వేమంత్రి విలేకరుల సమావేశం కోసం ఎదురుచూస్తున్నామని వివరించారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి జోన్ల వారీగా నిధుల కేటాయింపులపై వివరాలు త్వరలోనే విడుదలవుతాయని పేర్కొన్నారు. గతేడాది ఉమ్మడి జిల్లాల్లో రైల్వే ప్రాజెక్టులకు రూ.435 కోట్లు కేటాయించగా.. ఈసారి ఎంత అనేది ఆసక్తిగా మారింది.


