కేసీఆర్కు సిట్ నోటీసులు కక్షసాధింపే..
జగిత్యాలటౌన్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్య అని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ విమర్శించారు. కేసీఆర్ను సిట్ విచారణకు పిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం జిల్లాకేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధానవీధుల మీదుగా సాగిన బైక్ ర్యాలీలో వందలాది మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. విద్యాసాగర్రావు, రమణ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలకు తెరతీసిందని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం
కోరుట్ల: కేసీఆర్ను సిట్ విచారణకు పిలవడం కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలో భాగమేనని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కుమార్ అన్నారు. కేసీఆర్ను విచారణకు పిలవటాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపిన కేసీఆర్ ప్రజాదరణను కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని, ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం హామీల అమలుపై నిలదీస్తే ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


