పంపకాలపైనే దృష్టి
సర్పంచ్ అభ్యర్థులు, అనుచరులు గగ్గోలు మందు, విందుకు భారీగా ఖర్చు చేసిన అభ్యర్థులు గ్రానైట్, రెవెన్యూ గ్రామాల్లో రూ.కోటిన్నర దాటిన ఖర్చు విజేతలు, పరాజితులు అప్పులపాలు నేడు రెండోవిడత పోలింగ్కు సర్వం సిద్ధం
మా పైసలు మాకివ్వండి!
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
నోటుకు రాలవు ఓట్లు.. అనేది మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో తేలిపోయింది. తొలి విడత ఫలితాలు మూడో విడత అభ్యర్థులకు గుణపాఠమైంది. గ్రానైట్, రెవెన్యూ గ్రామాల్లో తొలివిడత ఎన్నికల్లో పోటాపోటీగా పంపకాలు చేసిన అభ్యర్థులు అప్పుల పాలయ్యారు. ఒక్కో గ్రామంలో రూ.30 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు పంపకాలు జరగడం గమనార్హం. రూ.లక్షలు ఖర్చుచేసినా ఓటమి తప్పకపోవడంతో తొలివిడత గ్రామాల్లోని పరాజితులు ఎక్కడ మిస్సయ్యిందని లెక్కలేసుకుంటున్నారు. కాగా.. ఎన్నికల్లో విజయం సాధించిన.. పరాజయం పొందిన ఇద్దరి జేబులు ఖాళీ అయ్యాయి. పైగా అప్పులపాలయ్యారు. విజయం సాధించిన అభ్యర్థి సంపాదించుకుంటాననే నమ్మకంతో ఉండగా పరాజయం పొందిన అభ్యర్థులు, వారి అనుచరులు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడెక్కడ ఎక్కువ ఖర్చు చేశారో, ఏ ప్రాంతంలో ఓట్లు రాలేదో తెలుసుకుని ‘మా డబ్బులు వెనక్కియ్యండంటూ’ ఆయా ప్రాంతాల ఓటర్ల వద్దకు వెళ్లి జబర్దస్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటుకు ఇంతని ఇచ్చినా కూడా ఓటర్లు ముఖం చూడకపోవడంతో అభ్యర్థుల ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. ‘ఒక్కో ఇంటికి పెద్దమొత్తమే ఇచ్చినం.. అయినా అక్కడ నాలుగు ఓట్లు కూడా పడలేదంటూ’ తిట్లపురాణం మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది.
మూడో విడతకు గుణపాఠం
తొలివిడత ఎన్నికల్లో ఓటర్లు నేర్పిన పాఠం మూడో విడత అభ్యర్థులకు గుణపాఠం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండోవిడతకు సంబంధించిన పంచాయతీల్లోనూ ప్రలోభాల పర్వం జోరుగానే సాగింది. చాలామంది ఓటర్లూ.. ఓటుకు నోటును ఆశిస్తుండటమూ కనిపించింది. ఓట్లు వేస్తారా.. లేదా.. తెలియదు కానీ.. పైసలైతే పంచాల్సిందే అని అభ్యర్థులే చెబుతుండటం గమనార్హం.
గ్రామాలకు చేరిన యువ ఓటర్లు
జగిత్యాలరూరల్: కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువత ఓటు వేసేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఉన్నత చదువులు చదువుతూ ఎంతో దూ రంలో ఉన్నవారు కూడా గ్రామాలకు చేరుకున్నా రు. గ్రామాల్లో రెండో విడత జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగ రిత్యా ఉన్నత విద్య కోసం హైదరాబాద్, బెంగుళూరు, పూణె, ఢిల్లీ, ముంబాయ్ ప్రాంతాల్లో ఉన్న యువ ఓటర్లను అభ్యర్థులు తమకు ఓటు వేయాలంటూ ఫోన్ల ద్వారా సంప్రదించి గ్రామాలకు రప్పించుకున్నారు.
జగిత్యాల: రెండోవిడత పోలింగ్ ఆదివారం జరుగనున్న నేపథ్యంలో అభ్యర్థులు పంపకాలపైనే దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు నిఘా పెట్టినప్పటికీ విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతోంది. ప్రచారం ముగియడంతో పోల్మేనేజ్మెంట్పై దృష్టి పెట్టారు. డబ్బుల పంపిణీపై దృష్టి పెట్టారు. అధికారులు నిఘా ఉన్నా పంపకాలు మాత్రం ఆగడం లేదు.
చావో రేవో...
రెండో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఫలి తాలు నేటితో తేలనున్నాయి. బరిలోకి దిగినవారు ఎలాగైనా గెలవాలన్న నేపథ్యంలో ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు చేశారు. చిన్న గ్రామపంచాయతీలోనే రూ.5లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చు చేయగా మేజర్ గ్రామపంచాయతీల్లో ఖర్చులకు చెప్పనక్కరలేదు. మహిళ సంఘాలు, కుల పెద్దల మద్దతు కూడగడుతున్నారు. ఇదిలా ఉండగా, దూర ప్రాంతాల్లో ఉన్నవారి కోసం డబ్బులు ఖర్చు పెట్టి వాహనాలు ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే కావడంతో ప్రతీ ఓటర్ను రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బరిలోకి దిగిన అభ్యర్థులు ఖర్చు ఎంతైనా సరే గెలవాలన్న ఒక స్టేటస్తోనే వెళ్తున్నారు.
‘మొదటి విడత రిజర్వేషన్లు వచ్చిన పలు గ్రామాల్లో కొందరు పెట్టుబడిదారులు సర్పంచ్ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారు. సదరు అభ్యర్థులు ఓడిపోవడంతో తిరిగి డబ్బు వసూలు చేసే పనిలో పడ్డారు.’
‘కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఓ గ్రామంలో దాదాపు రూ.35 లక్షల వరకు ఖర్చు చేసిన ఓ సర్పంచ్ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయాడు. తమ నాయకుడు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఓటర్లను అతని అనుచరులు వేధిస్తున్నారు.’
‘కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని ఓ రెవెన్యూ గ్రామ పంచాయతీలో రూ.80 లక్షల వరకు ఖర్చు చేసిన ఓ అభ్యర్థి దారుణంగా ఓడిపోవడంతో ఆస్తులు అమ్ముకునేందుకు సిద్ధం అయ్యాడు’.
పంపకాలపైనే దృష్టి


