
మానసిక వికలాంగులను చిన్నచూపు చూడొద్దు
జగిత్యాలజోన్: మానసిక వికలాంగులను చిన్నచూపు చూడొద్దని, వారికి చేయూత నందించాలని జగిత్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆర్.లావణ్య అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జగిత్యాల ఓల్డ్ హై స్కూల్, భవిత వికలాంగుల వసతి గృహంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, మానసిక వికలాంగుల్లో అద్భుత శక్తి ఉంటుందని, ఆ శక్తిని బయటకు తీసేందుకు ప్రయత్నించాలని కోరారు. మొదటి అదనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ శ్రీనిజ మాట్లాడుతూ, బాలిక విద్యను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని కోరారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. జిల్లా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కటుకం చంద్రమోహన్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.సతీశ్, విజయకృష్ణ, అనురాధ పాల్గొన్నారు.
వరదకాల్వ గండి పరిశీలన
జగిత్యాలఅగ్రికల్చర్: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గండ్లపేట వద్ద ఎస్సారెస్పీ వరదకాల్వకు 16.425 కి.మీ పరిధిలో గండి పడడంతో కొద్దిరోజులుగా నీటి విడుదలను నిలిపివేశారు. ఈ మేరకు శుక్రవారం ఎస్సారెస్పీ అధికారులు సత్యనారాయణరెడ్డి, సుధాకర్రెడ్డి గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించారు.
విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ
సారంగాపూర్(జగిత్యాల): పంటపొలాల వద్ద విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణతో పనులు నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్కో ఏడీఈ సిందూర్శర్మ, బీర్పూర్ ఏఈ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం బీర్పూర్ మండల కేంద్రంతో పాటు కొల్వాయి గ్రామంలో నిర్వహించిన పొలంబాట కార్యక్రమంలో మాట్లాడారు. ఎక్కడైనా లూజ్ వైర్లు, కిందికి వేళాడుతున్న వైర్లు, వంగిన, విరిగిన స్తంభాలు, ఇతర సమస్యలు ఉంటే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. రైతులు కెపాసిటర్లను వినియోగిస్తే విద్యుత్ ఆదాతోపాటు, మోటార్లు ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎల్ఎం శేఖర్, మహేశ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
సకాలంలో వేతనాలు చెల్లించాలి
కోరుట్లటౌన్: జీతాలు చెల్లించాలని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న ఉద్యోగులు శుక్రవారం ప్లకార్డులతో నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్య పరిషత్కు సంబంధించిన ఆసుపత్రుల్లో పని చేస్తున్న సిబ్బందికి జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతున్నాయని, బ్యాంకు అధికారులు వేధిస్తున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ప్రతి నెలా వేతనాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీతరాణి, జూనియర్ అసిస్టెంట్లు రాజశేఖర్, రాజయ్య, వైద్యసిబ్బంది సరళ, ప్రమీళ, కవిత, శ్రీధర్, చారి, సురేందర్, చిరంజీవి, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.

మానసిక వికలాంగులను చిన్నచూపు చూడొద్దు

మానసిక వికలాంగులను చిన్నచూపు చూడొద్దు

మానసిక వికలాంగులను చిన్నచూపు చూడొద్దు