
విద్యార్థులకు వరం ఏటీసీ
జగిత్యాల:
యువతకు వృత్తి విద్యలో నైపుణ్యం కలిగించి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం టాటా టెక్నాలజీ లిమిటెడ్ సహకారం తీసుకుంటోంది. ఇప్పటికే ఉన్న ఐటీఐలను ఆధునికీకరించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ)గా తీర్చిదిద్దిన సర్కార్.. 2025–26 విద్యా సంవత్సరం నుంచి సాంకేతిక విద్యను బలోపేతం చేసే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేస్తోంది. జగిత్యాల జిల్లా నూకపల్లి సమీపంలో ఏటీసీని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ శనివారం ప్రారంభించనున్నారు. ఇందులో విద్యార్థులకు సాంకేతిక నైపుణ్య విద్య అందిస్తారు. ఇందులో చేరేవారికి ఆరు కోర్సులు అందుబాటులో ఉంచారు.
అందుబాటులోని కోర్సులివే..
ఏటీసీలో ఆరు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రతీకోర్సులో 40 సీట్లు ఉంటాయి. ఇందులో మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్(40), ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ (40), బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరీఫైర్(24), అడ్వాన్స్డ్ సీఎన్సీ మిషనింగ్ టెక్నిషియన్(24), ఎలక్ట్రికల్ వెహికిల్ మె కా నిక్ (24), ఆర్టిసన్ యాజింగ్ అడ్వాన్స్డ్ టూల్(20 సీట్లు) కోర్సులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆధునిక వసతులు..
నూకపల్లి సమీపంలో ఏటీసీలో సుమారు రూ.4 కోట్ల వ్యయంతో ఆధునిక వసతులతో కూడిన భవనాన్ని ఇప్పటికే నిర్మించారు. ఇందులో విద్యార్థులకు అవసరమైన ప్రయోగశాలలు, ట్రైనింగ్కు సంబంధించిన ఇనిస్టిట్యూట్స్, మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ. 45 కోట్ల వ్యయం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఉజ్వల భవిష్యత్..
ఏటీసీల్లో చేరే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత హైటెక్ యుగంలో టెక్నాలజీ ద్వారానే ఎక్కువగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఇప్పటికే ఐటీఐ ఉండగా, ఇందులో పలుకోర్సుల్లో చేరి అనేకమంది యువత ఉద్యోగ అవకాశాలు దక్కించుకున్నారు. ఇందులో ముఖ్యంగా మేషన్, ఎలక్ట్రికల్, ప్లంబర్ తదితర కోర్సుల్లో శిక్షణ పొందారు. కొందరు విదేశాల్లో సైతం పనులు చేస్తున్నారు. ఏటీసీలో సైతం ఈ ఆరు కోర్సులు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు నచ్చిన కోర్సులో శిక్షణ పొందితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.
నేడు ప్రారంభించనున్న మంత్రి
నూకపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ఏటీసీని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ శనివారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.