ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే ఎబోలా వ్యాప్తిని నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలను బలోపేతం చేసింది. ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల నుండి వచ్చే వారిపై అమెరికా తాత్కాలిక నిషేధం విధించింది.
కానీ ఎయిర్ ఫ్రాన్స్ ఎయిర్లైన్స్ సిబ్బంది చేసిన పొరపాటు వల్ల ఒక కాంగో ప్రయాణికుడు పారిస్ నుంచి అమెరికా వెళ్లే విమానం ఎక్కేశాడు. అయితే సదరు ప్రయాణికుడికి తమ దేశంలో వచ్చేందుకు యూఎస్ అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో గమ్యస్థానానికి మరో 800 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ఆ విమానాన్ని కెనడాలోని మాంట్రియల్ ఎయిర్పోర్ట్ వైపు మళ్లించారు.
మాంట్రియల్ ఎయిర్పోర్ట్కు విమానం చేరుకున్న వెంటనే కెనడా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ (PHAC) క్వారంటైన్ అధికారులు రంగంలోకి దిగారు. అతడిని పరీక్షించి, ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని నిర్ధారించారు. దీంతో యూఎస్ అధికారులతో విమానంలోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ఎబోలా వైరస్ కారణంగా మధ్య ఆఫ్రికాలో ఇప్పటికే 140 మంది మరణించారు.
మరోవైపు ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో భారత్ కూడా అప్రమత్తమైంది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సుడాన్ దేశాల నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులు ఎబోలా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎయిర్ పోర్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది.


