ట్రంప్‌ సంచలన నిర్ణయాలు.. అమెరికన్లకు కొత్త టెన్షన్‌! | Trump Says Pain Will Be Worth The Price To Secure US interests | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ సంచలన నిర్ణయాలు.. అమెరికన్లకు కొత్త టెన్షన్‌!

Feb 3 2025 8:14 AM | Updated on Feb 3 2025 9:43 AM

Trump Says Pain Will Be Worth The Price To Secure US interests

వాషింగ్టన్: అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాలు అమెరికా ప్రజలకు శాపంగా మారే అవకాశం ఉంది. కెనడా, మెక్సికో, చైనా నుంచి దిగుమతులపై సుంకాలు విధించిన నేపథ్యంలో అమెరికాలో కొన్ని వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికన్లను ట్రంప్‌ హెచ్చరించారు. తాజాగా ట్రంప్‌.. వాణిజ్య భాగస్వామ్య దేశాలపై సుంకాల పెంపుదలతో అమెరికన్లు ఆర్థిక భారం మోయాల్సి రావచ్చని అన్నారు. అయినప్పటికీ ఈ విషయంలో తప్పక ప్రతిఫలం లభిస్తుందని చెప్పుకొచ్చారు.

కెనడా, మెక్సికో, చైనా నుంచి దిగుమతులపై సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కెనడా, మెక్సికో దేశాలపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు ప్రతీకార చర్యలకు నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో అమెరికాలో ధరలు కూడా పెరిగే ప్రమాదముందనే హెచ్చరికల నేపథ్యంలో అధ్యక్షుడు స్పందించారు. ఈ సందర్బంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. అమెరికన్లను రక్షించాల్సిన అవసరం నాపై ఉంది. అందరికీ భద్రత కల్పించడం అధ్యక్షుడిగా నా బాధ్యత. చట్టవిరుద్ధ వలసదారులను, మాదక ద్రవ్యాలు తమ సరిహద్దుల్లోకి రాకుండా చేస్తానని ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చాను. దానికి కట్టుబడి ఉన్నాను. వాణిజ్య భాగస్వామ్య దేశాలపై సుంకాల పెంపుదలతో అమెరికన్లు ఆర్థిక భారం మోయాల్సి రావచ్చు. అయినప్పటికీ విషయంలో తప్పక ప్రతిఫలం లభిస్తుంది.  అమెరికాను మళ్లీ గొప్పగా మారుస్తాను అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. మూడు దేశాలపై ట్రంప్‌ సుంకాలు విధించడంతో ఆయా దేశాలు అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగాయి. అందులో భాగంగా 155 బిలియన్‌ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తునట్లు జస్టిన్‌ ట్రూడో ప్రకటించారు. మెక్సికో సైతం ఇలాంటి చర్యలకు సిద్ధమైంది. తాము కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్‌లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌ పేర్కొన్నారు. చైనాకు కూడా స్పందిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థలో ట్రంప్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. తప్పుడు పద్ధతులను సరిచేసుకోవాలని అమెరికాను కోరుతున్నాం అంటూ హితవు పలికింది.

Advertisement
 
Advertisement
Advertisement