ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వను చాలా లోతైన, బలమైన, రక్షణతో కూడిన ప్రదేశంలో భద్రపరచి ఉంచారా? ప్రస్తుతం దాన్ని బయటకు తీసుకురావడం లేదా వినియోగించడం సులభం కాదా? ఆ నిల్వ తక్షణ ప్రమాదం సృష్టించే స్థితిలో లేదని ట్రంప్ అంటున్నారు. అందువల్ల దాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా వెంటనే సైనిక చర్య చేపట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ ఒక్క కారణంతో ఎంత పెద్ద యుద్ధం ఆగిందో తెలుసా?
పశ్చిమాసియా ఘర్షణ మళ్లీ తెరపైకి వచ్చిన వేళ వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య సున్నితమైన దౌత్య చర్చలు కొనసాగుతున్న సమయంలో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పలు వివరాలు తెలిపారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వెలికితీసేందుకు అమెరికా సైన్యాన్ని ఇరాన్లోకి పంపే సైనిక ప్రణాళికను పరిశీలించినప్పటికీ చివరకు తిరస్కరించినట్టు ట్రంప్ తెలిపారు.
ట్రంప్ తెలిపిన వివరాలు ప్రకారం.. సరిహద్దులు దాటి చేపట్టాల్సిన ఆ ఆపరేషన్ అత్యంత ప్రమాదకరమని తేలింది. భారీ స్థాయి సైనిక సమీకరణ అవసరమయ్యేది. ఆ క్లిష్టమైన మిషన్ పూర్తి కావాలంటే కనీసం 2 వారాలు పట్టేదని, భారీ స్థాయిలో సైనిక సామగ్రిని ఇరాన్ భూభాగంలోకి తరలించాల్సి వచ్చేదని చెప్పారు. సున్నితమైన అణు పదార్థాన్ని "న్యూక్లియర్ డస్ట్"గా పేర్కొన్న ట్రంప్.. ఆ నిల్వను స్వాధీనం చేసుకునే పలు మార్గాలను పెంటగాన్ అధికారులు పూర్తిగా పరిశీలించారని తెలిపారు.
యురేనియం సమాధిలో పాతిపెట్టినట్టే..
సైనిక ప్రణాళికను నిలిపివేసినా అలాంటి చర్య చేపట్టే శక్తి వాషింగ్టన్కు ఇప్పటికీ ఉందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. "మేము ఇప్పుడే దాన్ని తీసుకోగలం" అని ట్రంప్ అన్నారు. "మనం అనుకుంటే వాళ్లు మమ్మల్ని అడ్డుకోలేరని నేను భావిస్తున్నాను. కానీ అలా చేయాల్సిన అవసరం లేదు. అది సమాధిలో పాతిపెట్టినట్టే ఉంది" అని చెప్పారు. ఆ పదార్థం ప్రస్తుతం సురక్షితంగానే ఉందని, తక్షణ జోక్యం అవసరం లేదని పేర్కొన్నారు. శుద్ఙచేసిన యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలంటే టెహ్రాన్తో అధికారిక దౌత్య ఒప్పందం అవసరం లేదని కూడా చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో ముఖాముఖి భేటీపై ఆసక్తి లేదని తెలిపారు. అయితే, వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య దౌత్యం ఖరారైతే, అలాంటి ఉన్నత స్థాయి సమావేశం జరగవచ్చని అంగీకరించారు. "అది జరిగితే... నేను గౌరవప్రదంగానే వ్యవహరిస్తాను" అని ట్రంప్ చెప్పారు.
మొజ్తబా ఖమేనీ, తన తండ్రి హత్య అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని చేపట్టారు. ఆయన తండ్రి అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడిలో మరణించారు. ఖమేనీ కుటుంబ సభ్యులపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు కచ్చితమైన దాడులు చేసినప్పటికీ, మొజ్తబా ఖమేనీ సరైన వైఖరి ప్రదర్శిస్తారని తాను ఆశిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. "మేము అతని తండ్రి, అతని భార్య, అతని కుమారుడిని చంపాము. కాబట్టి నేనంటే ఆయను ఇష్టం ఉండకపోవచ్చు. కానీ కొన్ని వర్గాల్లో కాయనకు చాలా మంచి పేరు ఉంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇలాంటి కఠిన వ్యాఖ్యలు వినిపిస్తున్న వేళ.. అక్సియోస్ ప్రచురించిన కథనం ప్రకారం, అమెరికా సీనియర్ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ గురువారం టెన్నెసీలోని ఓక్ రిడ్జ్కు వెళ్లి, ఇరాన్తో జరగబోయే అణు చర్చల్లో కీలక పాత్ర పోషించనున్న సాంకేతిక నిపుణులతో సమావేశమయ్యారు.
వైట్ హౌస్, యుద్ధ చర్యలు నిలిపివేయడం, సమగ్ర అణు చర్చలు ప్రారంభించడం లక్ష్యంగా టెహ్రాన్తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే చర్చలకు సంబంధించిన సమాచారం తెలిసిన అమెరికా అధికారులు, ప్రాంతీయ మధ్యవర్తులు తెలిపినట్టు, ప్రతిపాదిత ఒప్పందంలోని కీలక అంశాలపై రెండు ప్రభుత్వాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి.
ఈ అత్యంత కీలక చర్చలు తుది దశలో ఉన్నట్టు సమాచారం వచ్చినా, స్పష్టమైన పురోగతి సాధించే అవకాశం ఇంకా అనిశ్చితంగానే ఉంది. ఓ అమెరికా అధికారి, ఓక్ రిడ్జ్కు ఉన్నత స్థాయి ప్రతినిధుల పర్యటన ఒప్పందం ఖరారవుతుందనే హామీ కాదని, అయితే చర్చలు తీవ్రమైన దశలోకి ప్రవేశించాయని సూచించే స్పష్టమైన సంకేతమని చెప్పారు.
అయితే ఈ విభేదాలు ఇప్పటికీ దౌత్య ప్రక్రియకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఇరాన్ శుద్ఙచేసిన యురేనియాన్ని సాఫ్ట్ చేసే ప్రక్రియ పూర్తి చేయాలంటూ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా 60 రోజుల గడువు కోరుతోంది. ఇరాన్ మాత్రం 90 రోజుల గడువుపై పట్టుదలగా ఉంది.
ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు ఒకరు మీడియాతో మాట్లాడుతూ, నిలిపివేసిన యూఎస్డీ 24 బిలియన్ ఆస్తుల విషయంలో దౌత్య చర్చలు ప్రతిష్ఠంభనలో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు నిర్ణయం ట్రంప్ చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు.


