ఉగ్రవాదానికి చోటు లేదు: నెతన్యాహుతో ఫోన్‌లో ప్రధాని మోదీ | Terrorism has no place in our world: PM Modi speaks to Netanyahu | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదానికి చోటు లేదు: నెతన్యాహుతో ఫోన్‌లో ప్రధాని మోదీ

Sep 30 2024 9:01 PM | Updated on Sep 30 2024 9:01 PM

Terrorism has no place in our world: PM Modi speaks to Netanyahu

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాలతో నెలకొ​న్న ఉద్రిక్త వాతావరణంపై నెతన్యాహుతో చర్చించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

‘పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాలపై ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడాను. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటులేదు. స్థానికంగా ఉద్రిక్తతలు తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు బందీలందరిని సురక్షితంగా విడుదల చేయడం చాలా ముఖ్యం. వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాల పునరుద్ధరణ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారత్‌ కట్టుబడి ఉంది.’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఇటీవల ఇజ్రాయెల్‌ లెబనాన్‌, హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా దాడులు తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లెబనాన్‌ రాజధాని బీరూట్‌పై జరిపిన దాడిలో హెజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లా సహా కీలక కమాండర్లను హతమార్చింది.దాంతో హెజ్‌బొల్లాలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. 

మూడు దశాబ్దాల పైచిలుకు సారథ్యంలో సంస్థను తిరుగులేని సాయుధ శక్తిగా మార్చిన ఘనత నస్రల్లాది. ఆయన మృతితో ఇప్పుడు ఇజ్రాయెల్‌ నుంచి ఎదురవుతున్న పెను దాడులను కాచుకుంటూ కష్టకాలంలో సంస్థను ముందుండి నడిపేది ఎవరన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కొత్త సారథిగా నస్రల్లాకు వరుసకు సోదరుడయ్యే హషీం సైఫుద్దీన్‌ పేరు గట్టిగా వినిపిస్తోంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement