కెన్యా రాజధాని నైరోబికి వాయవ్య దిశలో సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిల్గిల్ ప్రాంతంలోని ఓ బోర్డింగ్ స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించి 16 మంది విద్యార్థినులు మృతి చెందారు. అంతేగాక, పదుల సంఖ్యలో విద్యార్థినులు గాయపడగా, వారిని ఆసుపత్రులకు తరలించారు.
వారిలో 71 మందికి చికిత్స అందించి డిశ్చార్జ్ చేయగా, మరో ఏడుగురికి ఇంకా చికిత్స అందుతోంది. అగ్నిప్రమాదం ఎలా జరిగిందో ఇంకా తేలలేదని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెప్పారు. ఉటుమిషి గర్ల్స్ అకాడమీలో గురువారం తెల్లవారుజామున విద్యార్థినులు నిద్రలో ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. తమ పిల్లల గురించి సమాచారం తెలుసుకునేందుకు ఆందోళనతో తల్లిదండ్రులు, బంధువులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
దీనిపై కెన్యా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ.. వసతి గృహంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగి, ఆ భాగం పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. అగ్నిమాపక బృందాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయని, కానీ అప్పటికే భారీ నష్టం జరిగిపోయిందని చెప్పారు.
మృతుల కుటుంబాలకు అంతర్గత వ్యవహారాల మంత్రి కిప్చుంబా సంతాపం తెలిపారు. “ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇప్పటివరకు 16 మంది మరణించినట్లు గుర్తించాం. కెన్యా ప్రజలు అందరూ ఆ కుటుంబాలకు ప్రార్థనలతో, మద్దతుతో అండగా నిలవాలి” అని అన్నారు. ప్రజలు సహనం పాటించాలని, వదంతులను నమ్మొద్దని చెప్పారు. కెన్యాలోని వసతి పాఠశాలల్లో అగ్నిప్రమాదాలు కొత్త విషయం కాదు. గత కొన్ని సంవత్సరాల్లో అనేక ప్రాణాంతక ఘటనలు చోటుచేసుకున్నాయి.


