ఈశాన్య కాంగోలో ఎబోలా వైరస్ పంజా విసురుతోంది. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే స్ధానికుల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలు, ఆగ్రహం కాస్తా హింసకు దారితీస్తున్నాయి. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే రెండు ఎబోలా చికిత్సా కేంద్రాలపై దాడులు జరిగాయి.
మోంగ్బ్వాలు అనే మైనింగ్ టౌన్లో 'డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్' అనే అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో ఓ ఆస్పత్రి నడుస్తోంది. అయితే ఈ ఆస్పత్రి ప్రాంగణంలో ఎబోలా రోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక చికిత్సా శిబిరం టెంట్కు స్ధానికులు శుక్రవారం రాత్రి నిప్పంటిచారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తలు పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే ఈ గందరగోళంలో ఎబోలా సోకినట్లు అనుమానిస్తున్న 18 మంది రోగులు ఆసుపత్రి నుంచి తప్పించుకుని పారిపోయారు. ఆ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రిచర్డ్ లోకుడి ఈ ఘటనను ఖండించారు. వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులు అదృశ్యం కావడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వ్యాప్తి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
కాగా ఈ ఘటనకు ఒక రోజు ముందు ర్వాంపారా అనే పట్టణంలో ఇలాంటి వాతవారణమే దాడే జరిగింది. అక్కడ ఒక ఎబోలా చికిత్సా కేంద్రాన్ని స్థానికులు తగులబెట్టారు. ఎబోలాతో మరణించినట్లు భావిస్తున్న ఒక వ్యక్తి మృతదేహాన్ని వారి సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడమే ఈ దాడికి కారణమైంది.


