PM Modi exchanges gifts with US President Joe Biden, First Lady Jill - Sakshi
Sakshi News home page

వైట్‌హౌజ్‌లో భారత ప్రధానికి విందు: మోదీకి పాతకాలపు కెమెరా.. బైడెన్‌కు ఉపనిషత్తుల కాపీ

Jun 22 2023 8:02 AM | Updated on Jun 22 2023 11:19 AM

PM In Washington: Dinner With Bidens Exchange Gifts - Sakshi

అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు డైమండ్‌ను గిఫ్ట్‌గా మోదీ.. 

అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌ డీసీ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అధ్యక్ష భవనం వైట్‌ హౌజ్‌కు చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌, ప్రథమ మహిళ బిల్‌ బైడెన్‌లు మోదీని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆ దంపతుల ఆతిథ్యం స్వీకరించారాయన.  

సరదాగా కబుర్లతో పాటు ప్రపంచ పరిణామాలపైనా ఈ ఇద్దరు నేతలు చర్చించారు. అనంతరం విందులో పాల్గొన్నారు. బైడెన్‌ దంపతుల ఆహ్వానం మేరకు ద్వైపాక్షిక చర్చల కోసం ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి విదితమే. 

కానుకలు..
ఇక మోదీకి జో-జిల్ బిడెన్‌లు కానుకలు సమర్పించారు.  20వ శతాబ్ద ప్రారంభపు కాలానికి చెందిన..  పురాతన అమెరికన్ బుక్ గ్యాలీని ఆ దంపతులు కానుకగా ఇచ్చారు.  అలాగే బైడెన్‌ పర్సనల్‌గా మోదీకి పాతకాలపు ఓ అమెరికన్ కెమెరాను బహుమతిగా ఇచ్చారు.  దానితో పాటుగా జార్జ్ ఈస్ట్‌మన్ మొదటి కొడాక్ కెమెరా పేటెంట్ ఆర్కైవల్ ఫాక్సిమైల్ ప్రింట్, అమెరికన్ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ హార్డ్ కవర్ పుస్తకాన్ని కూడా బహుమతిగా ఇచ్చారు. ఇక ఆయన భార్య జిల్ బైడెన్ ప్రధాని మోదీకి రాబర్ట్ ఫ్రాస్ట్ కవితల సంకలన సంతకం మొదటి ఎడిషన్ కాపీని బహుమతిగా ఇచ్చారు. 

భారత్‌లో అనుబంధం ఉన్న ఐరిష్‌ రచయిత, నోబెల్‌ విన్నర్‌ డబ్ల్యూబీ యేట్స్‌ ‘భారత ఉపనిషత్తుల’ ఆంగ్ల తర్జుమా కాపీ(శ్రీ పురోహిత్‌ స్వామి సహరచయిత) కాపీని బైడెన్‌కు భారత ప్రధాని మోదీ కానుకగా ఇచ్చారు. దీనిని లండన్‌కు చెందిన ఫెబర్‌ అండ్‌ ఫెబర్‌  లిమిటెడ్‌ వాళ్లు.. యూనివర్సిటీ ప్రెస్‌ గ్లాస్గోలో ముద్రించారు. కాళిదాసుడి రచనల ప్రభావం తనపై ఎంతో ఉందని  డబ్ల్యూబీ యేట్స్‌ పలుమార్లు చెప్పుకున్నారు. అంతేకాదు.. రవీంధ్రనాథ్‌ ఠాగూర్‌ సమకాలీకుడిగా పేరున్న యేట్స్‌.. 1923లో సాహిత్య రంగంలో నోబెల్‌ అందుకున్నారు.

అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని(గ్రీన్‌ డైమండ్‌) బహుమతిగా ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ వజ్రం.. పర్యావరణ అనుకూలమైంది. సోలార్‌, విండ్‌ పవర్‌ లాంటి వనరులను ఉపయోగించి దీనిని రూపొందించారు. 

మేము అనేక విషయాలపై గొప్ప విషయాలపై మాట్లాడుకున్నాం అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు కూడా. 

Advertisement
 
Advertisement
Advertisement