ఆకలి తీర్చే అమ్మమ్మ! | Lebanese Grandmother Soubhiye Zeiter Feeds Thousands Displaced By War, Check Out Her Interesting Story Inside | Sakshi
Sakshi News home page

ఆకలి తీర్చే అమ్మమ్మ!

May 22 2026 5:47 AM | Updated on May 22 2026 10:47 AM

Lebanese grandmother Soubhiye Zeiter feeds thousands displaced by war

ఇజ్రాయెల్‌ దాడులతో నీడ కోల్పోయిన వారికి అండగా జైటర్‌

పొద్దున్నే సూర్యుడి ఉదయించినట్టు.. ఆవిడ ఉదయాలు ప్రతిరోజూ ఓ పేద్ద కాఫీ కప్పుతో మొదలవుతాయి. ఆమె చిన్న గుడారం బయట పుష్పగుచ్ఛాలతో అలంకరించిన ఓ సాదాసీదా బల్ల..నిశ్శబ్ద వాతావరణం..ఓ కప్పు కాఫీ అంతే..! కాఫీ ఆస్వాదించడం ముగిసిన వెంటనే అలికిడి మొదలవుతుంది. ఆమె పొందికగా ఏర్పాటు చేసిన ఓ చిన్న బేకరీ ముందు అప్పటికే జనాలు తమ వంతు రొట్టెముక్క కోసం వరుసగా నిల్చుని ఎదురు చూస్తుంటారు. అదిగో ఆ క్షణంలోనే ఈ అమ్మ్మ తన పని మొదలుపెడుతుంది.. తలా ఓ రొట్టె ముక్కతో ఆకలి తీరుస్తుంది. అంతా ఉచితంగానే..అందరికీ ఆమే అన్నపూర్ణ! 

బీరూట్‌: అది లెబనాన్‌ రాజధాని బీరూట్‌లో మధ్యధరా సముద్రానికి, సంపన్నులుండే డౌన్‌టౌన్‌ ప్రాంతం. కిక్కిరిసి ఉన్న ఓ టెంట్‌లో చిన్న టేబుల్‌ వద్ద ఓ పెద్దావిడ కూర్చుని వచ్చిన వారికి బ్రెడ్, టీ అందిస్తున్నారు. టెంట్‌ వెలుపల చాంతాండంత క్యూలు. ఉదయం మొదలైన బ్రెడ్, టీ పంపిణీ అర్ధరాత్రి వరకు ఆగకుండా కొనసాగుతూనే ఉంటుంది. అదీ ఊచితంగా. ఆవిడ 63 ఏళ్ల సౌభియె జైటర్‌. హెజ్‌బొల్లా సాయుధ గ్రూపు లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ సాగిస్తున్న దాడులతో నిరాశ్రయులైన 10 లక్షల మందిలో జైటర్‌ ఒకరు.  

ఇజ్రాయెల్‌ ఆర్మీ హెచ్చరికలతో రాజధాని బీరూట్‌ శివారు ప్రాంతంలో ఉండే జైటర్‌ తన కుటుంబంలోని 15 మంది సభ్యులతో కలిసి నగరం మధ్యలోకి మకాం మార్చారు. వాళ్లంతా ఇప్పుడు ఓ టెంట్‌లో గడుపుతున్నారు. శరణార్థి శిబిరానికి వచ్చిన కొత్తలో జైటర్‌ సమీపంలో నిర్వహించే ఆహార పంపిణీ కేంద్రానికి వెళ్లారు. అక్కడ గంటల తరబడి క్యూలో నిల్చున్నా తినేందుకు ఏదైనా అందుతుందో లేదో తెలియదని పరిస్థితి ఉండేది. దీంతో, ఆమె సాయం కోసం ఎదురుచూడరాదని నిర్ణయించుకున్నారు. తన కుటుంబంతో పాటు అవసరమైన వారి కోసం తానే స్వయంగా ఆహారం తయారు చేసేందుకు నడుం బిగించారు. 

వెంట తెచ్చుకున్న గుండ్రటి ఇనుప పెనంపై రోజుకు సుమారు 200 మనాఇష్‌ రొట్టెలను కాల్చి, ఉచితంగా పంపిణీ చేయడం మొదలుపెట్టారు. విషయం తెలియడంతో గూడు కోల్పోయిన చాలా మంది రోజూ ఉదయాన్నే అక్కడకు రావడం ప్రారంభించారు. త్వరలోనే, ఆ క్యూలు ఆమె ఒక్కతే నిర్వహించలేనంతగా పెరిగిపోయాయి. ఇప్పుడు, ఆ శరణార్థి శిబిరంలోని ఆమె చిన్న మూల ఒక బేకరీగా మారిపోయింది. కొందరు సాయం చేస్తామంటూ వలంటీర్లుగా ముందుకు వచ్చారు. 

ఆమె చేస్తున్న మంచి పని గురించి విన్న కొందరు ఒక పెద్ద గ్యాస్‌ ఆధారిత ఓవెన్‌ను విరాళంగా ఇచ్చారు. అది తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ఆగకుండా పని చేస్తూనే ఉంటుంది. రొట్టెల తయారీకి సైతం యంత్రాన్ని సమకూర్చుకున్నారు. ఓవెన్‌ నుంచి వేడివేడి రొట్టెలు బయటకు రాగానే వలంటీర్లు వాటిని అంతే వేగంగా ప్యాక్‌ చేస్తున్నారు. ‘మేం డిమాండ్‌ను అందుకోలేక పోతున్నాం. రోజుకు 3 వేల నుంచి 3,500 వరకు మనాఇష్ లను తయారు చేస్తున్నాం. అయినప్పటికీ అన్నార్తులు ఇంకా వస్తూనే ఉన్నారు’అని తెలిపారు జైటర్‌.  

టెంట్‌ నుంచి సామాజిక ఉద్యమం 
నిరాశ్రయులైన పిల్లల కోసం కేవలం జైటర్‌ వంటతో ప్రారంభమైన ఈ ప్రయాణం.. ఇప్పుడు దాదాపు పూర్తిగా విరాళాల ద్వారా నడిచే ఒక సామూహిక సామాజిక ఉద్యమంగా మారింది. ఆమె అక్కడ ఇప్పుడొక హీరో అయిపోయారు. ఇటీవల బీరూట్‌ గవర్నర్‌ సైతం ఆమెతో కలిసి కాఫీ తాగడానికి అక్కడికి రావడం విశేషం. ‘నా తోటి ప్రజలు గ్యాస్‌ సిలిండర్లను విరాళంగా ఇవ్వడం ప్రారంభించారు. కొందరు పిండి, మసాలా దినుసులు ఇస్తున్నారు. ఇంకొందరు నూనె, చీజ్, మాంసం, ఈస్ట్‌ తీసుకువస్తున్నారు. 

ఈ బేకరీకి ఏది అవసరమో అది అందజేస్తున్నారు’అని జైటర్‌ వివరించారు. ‘ఇక్కడ ప్రతి ఒక్కటీ ఉచితమే. డబ్బు సంపాదన కోసం ప్రయత్నించే అవసరం నాకు లేదు’అంటున్నారు. యుద్ధం కారణంగా ఇల్లు వదిలి వచ్చి నెలలు గడుస్తున్నా సౌభియే జైటర్‌ దినచర్య ఇప్పటికీ ఏమాత్రం మారలేదు. ఉదయాన్నే బీరూట్‌లోని తన టెంట్‌ వెలుపల పూలతో అలంకరించిన ఒక చిన్న టేబుల్‌ పక్కన కూర్చుని కనిపిస్తారు. అటుగా వచ్చిన వారిని టీ తాగి వెళ్లండంటూ నవ్వుతూ ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు అక్కడి వారందరికీ ఆమె ఓమ్‌ మహమ్మద్‌ అంటే మహమ్మద్‌ తల్లి అని అర్థం వచ్చే అమ్మమ్మ అన్నమాట.  

టెంట్‌ కాదు.. సొంతూరు 
జైటర్‌ దృష్టిలో, ఈ బేకరీ కేవలం ఆకలి తీర్చే టెంట్‌ మాత్రమే కాదు. ఇక్కడుండే వారు సర్వస్వం కోల్పోయామని బాధ పడకుండా తమ సొంతూరి వాతావరణాన్ని తలపించేలా ఉండాలని ఆమె కోరుకుంటున్నారు ’మేమంతా నిరాశ్రయులమయ్యాం. ఇల్లు పోయినంత మాత్రాన, నిరాశ్రయురాలినైనంత మాత్రాన మనోధైర్యాన్ని కోల్పోవాలని అనుకోవడం లేదు’ అని ఆమె అన్నారు.

 ఆమె చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత విజయవంతమైనప్పటికీ ఆకాశంలో నిరంతరం తిరిగే డ్రోన్ల శబ్దాలు, దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ జరుపుతున్న వైమానిక దాడుల వార్తలు తమ జీవితాలు ఎంతగా మారిపోయాయో నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ, తను గతంలో ఉన్న మంచి రోజుల్లో చేసిన పనులనే ఇప్పుడూ చేయడానికి ఆమె ప్రయతి్నస్తున్నారు. తన మనవడు, మనవరాళ్లతో ఆడుకుంటూ, బెల్లా అనే తన చిన్న తెల్లటి పెంపుడు కుక్కతో కాలక్షేపం చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement