
జెరుసలేం: పశ్చిమాశియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. ఈ క్రమంలో ఏ సమయంలోనైనా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయొచ్చంటూ అమెరికన్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ దాడి ఆపాలంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. నెతన్యాహు మాత్రం ఇరాన్పై దాడి విషయంలో వెనక్కి తగ్గబోమని తేల్చేశారు.
ఈ నేపథ్యంలో, అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇజ్రాయెల్ త్వరలోనే ఇరాన్పై దాడి చేయనుందని.. ఈ దాడి అమెరికా అనుమతి లేకుండానే జరిగే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది. ఇరాన్- అమెరికాల మధ్య అణు ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది. ఆ చర్చలు విఫలమైతే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయనున్నట్లు కథనాలు హైలెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న అమెరికన్లు తిరిగి సొంత దేశం వచ్చేయాలంటూ ట్రంప్ పిలుపునిచ్చారు. అక్కడి నుంచి అమెరికన్ సిబ్బందిని తరలించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రముఖ మీడియా హౌస్ ఆక్సియోస్ నివేదిక ప్రకారం.. ఇరాన్తో అమెరికా అణుఒప్పందం కుదుర్చుకునేందుకు గత కొంత కాలంగా చర్చలు జరుపుతూ వస్తోంది. తాజాగా జరిపే చర్చలు విఫలమైతే.. ఇరాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రధాని ట్రంప్ అనుమతి కోరననున్నారు.
ఇజ్రాయెల్ హెచ్చరికలపై ఇరాన్ సైతం అదే రీతిలో బదిలిస్తోందని ఆదేశ ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదె హెచ్చరించారు. ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అమెరికా మిలిటరీ బేసులపై నేరుగా దాడులు చేస్తామని పునరుద్ఘాటించారు.
ఇరాన్ హెచ్చరికలతో అమెరికా విదేశాంగ శాఖ, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాల్లో ఉన్న దౌత్య కార్యాలయాల్లో అత్యవసర చర్యల కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మధ్యప్రాచ్యం, తూర్పు యూరోప్, ఉత్తర ఆఫ్రికాలోని యుఎస్ దౌత్య కార్యాలయాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు పంపించాయి. అంతేకాక, బహ్రెయిన్, కువైట్ వంటి ప్రాంతాల నుంచి అవసరం లేని సిబ్బందిని స్వచ్ఛందంగా వెనక్కు పంపేందుకు అనుమతి ఇచ్చింది.
అమెరికా మిలిటరీ బేసులు ప్రస్తుతం ఇరాక్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. ఇటువంటి సున్నితమైన పరిస్థితుల్లో ఇజ్రాయెల్ నిర్ణయంతో పశ్చిమాసియా దేశాల్లో కమ్ముకున్న యుద్ధమేఘాలతో భయాందోలన నెలకొంది.