టెహ్రాన్: అమెరికాతో మళ్లీ యుద్ధం జరగొచ్చంటూ ఇరాన్ సీనియర్ సైనిక అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలు నిలిచిపోవడంతో అమెరికాతో తిరిగి ఘర్షణ తలెత్తే అవకాశం ఉందన్నారు. అమెరికా హామీలకు, ఒప్పందాలకు కట్టుబడి ఉండదని ఆధారాలు చూపిస్తున్నాయంటూ ఇరాన్ సైనిక కేంద్ర కమాండ్ సెంటర్ 'ఖతమ్ అల్-అంబియా'కు చెందిన మొహమ్మద్ జాఫర్ అసాదీ అన్నట్లు ఇరాన్ ఫార్స్ వార్తా సంస్థ పేర్కొంది.
మరో వైపు, యుద్ధాన్ని పూర్తిగా ముగించడానికి ఇరాన్ తమతో కొత్త ప్రతిపాదన చేసిందని.. అయితే, అందులోని అంశాలపై తాను సంతృప్తి చెందడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇరాన్ ప్రపోజల్ నచ్చలేదన్న ట్రంప్... అసలు ఈ ప్రపొజల్ ఏమిటి? అందులో పేర్కొన్న అంశాలేమిటి? అనేది ఆయన స్పష్టంగా చెప్పలేదు.
ఇదిలా ఉండగా.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో ఇరాన్పై యుద్ధం ముగిసిపోయిందంటూ అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. 1973 నాటి చట్టం ప్రకారం.. ఇతర దేశాలపై 60 రోజులకు పైగా యుద్ధం చేస్తే అమెరికా కాంగ్రెస్(చట్టసభ) నుంచి ప్రభుత్వం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన నుంచి తప్పించుకోవడానికే ఇరాన్పై యుద్ధం ముగిసిందని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఇరాన్పై యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అనుమతి పొందలేదు. పశ్చిమాసియాలో ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఘర్షణలు ముగిశాయని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు ఏప్రిల్ 7న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత అమెరికా, ఇరాన్ల మధ్య దాడులు జరగలేదని గుర్తుచేశారు.


