యుద్ధ భయం.. ఇజ్రాయెల్‌లోని భారతీయులకు కేంద్రం సూచనలు | India Issues Advisory For Citizens In Israel: We Are At War, Says PM | Sakshi
Sakshi News home page

యుద్ధ భయం.. ఇజ్రాయెల్‌లోని భారతీయులకు కేంద్రం సూచనలు

Oct 7 2023 3:44 PM | Updated on Oct 7 2023 5:06 PM

India issues Advisory For Citizens In Israel We Are At War Says PM  - Sakshi

ఇజ్రాయెల్‌, గాజా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాజా స్ట్రిప్‌ నుంచి ఇజ్రాయెల్‌ భూభాగంలోకి చొరబడిన పాలస్తీనా హమాజ్‌ మిలిటెంట్లు..  ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించారు. ఆపరేషన్ అల్-అక్సా’ పేరుతో శనివారం ఉదయం నుంచి 5 వేల మిస్సైల్స్‌తో విరుచుకుపడ్డారు. ఇజ్రాయిల్‌ దక్షిణ ప్రాంతంలోని సరిహద్దు పట్టణాల్లోకి ప్రవేశించి వీధుల్లో తిరుగుతూ కాల్పులు జరుపుతున్నారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 22 మరణించగా.. 500 మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఆకస్మిక దాడులపై ఇజ్రాయెల్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. జెరూసలెంతో సహా ఇజ్రాయెల్‌ వ్యాప్తంగా సైరన్‌లు మోగించి ప్రజలను అప్రమత్తం చేసింది. పాలస్తీనా మిలిటెంట్లు తమ భూభాగాల్లోకి చొచ్చుకొచ్చినట్లు  తెలిపింది. దక్షిణ, మధ్య ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలపింది. ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచించింది. 

హమాజ్‌ మిలిటెంట్లపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. ‘ఆపరేషన్‌ ఐరన్‌ స్వార్డ్స్‌’ పేరుతో గాజాలోని హమాజ్‌ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది.గాజా సరిహద్దుల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది. దేశం యుద్ధంలో పోరాడుతుందని, తప్పకుండా విజయం సాధిస్తామని ఇజ్రాయెల్‌ ప్రధాని  బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. తమ పౌరులను రక్షించుకుంటామని పేర్కొన్నారు. దాడులకు ప్రతిఫలంగా హమాజ్‌ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. 

భారతీయ పౌరులకు అడ్వైజరీ..
ఇజ్రాయెల్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో అక్కడ నివసిస్తున్న భారతీయులకు కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న తమ పౌరులు  అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. స్థానిక అధికారుల సలహా మేరకు భద్రతా ప్రోటోకాల్‌ను పాటించాలని కోరింది. అనవసరంగా బయటకు రావొద్దని, ఒకవేళ వస్తే బాంబ్‌ షెల్టర్ల వద్ద ఆశ్రయం పొందాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ సిబ్బందిని సంప్రదించండంటూ టెల్‌ అవివ్‌లోని భారత దౌత్యకార్యాలయం  పేర్కొంది.

గాజా సరిహద్దులోకి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించిన హమాజ్‌ ఉగ్రవాదులు పౌరుల నివాసాలపై కాల్పులకు తెగబడుతున్నారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని సెరాట్‌ ప్రాంతంలో కొందరు హమాస్‌ ఉగ్రవాదులు వాహనంలో వెళ్తూ కాల్పులు జరుపుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇజ్రాయెల్‌ సరిహద్దులోని వందలాది మంది జనాలు ఆహార పదార్థాలు, అత్యవసర వస్తువులు చేతపట్టుకొని ఇతర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు.

ఎందుకీ ఘర్షణలు
ఇదిలా ఉండగా.. 2007లో జరిగిన యుద్ధంలో విజయం సాధించి గాజాలో హమాజ్‌ అధికారం చేపట్టింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ గజాన్ కార్మికులకు సరిహద్దులను మూసివేసిన తర్వాత ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఏడాది జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 247 మంది పాలస్తీనియన్లు, 32 మంది ఇజ్రాయిలీలు, ఇద్దరు విదేశీయులు మరణించారు. వీరిలో సైనికులతోపాటు పౌరులు కూడా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement