ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్లు శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి. శాంతి చర్చలకు ముందు లెబనాన్పై దాడులు ఆపాలని, ఫ్రీజ్ చేసిన నిధుల్ని విడుదల చేయాలని రెండు కండీషన్లు ఉంచింది ఇరాన్. దీంతో చర్చలు ఎలా ముందుకు సాగుతాయా? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే చర్చల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాట్ కామెంట్లు చేశారు.
శాంతి చర్చలు గనుక విఫలమైతే ఇరాన్పై గట్టి దాడులే జరుపుతామని హెచ్చరించారు. న్యూయార్క్ పోస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘చర్చలు విఫలమైతే అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్పై దాడులకు రెడీగా ఉన్నాయి. ఈసారి మా యుధ్ధనౌకలను అత్యంత ఆధునిక ఆయుధాలతో నింపాం. ఒకవేళ ఒప్పందం గనుక కుదరకపోతే అత్యంత శక్తివంతంగా సైనిక చర్య ఉంటుంది. మరో 24 గంటల్లో ఏదనేది తేలిపోతుంది’’ అంటూ వ్యాఖ్యానించారాయన.
సోషల్ ట్రూత్లోనూ ట్రంప్ కాస్త ఘాటుగానే ఓ పోస్ట్ చేశారు. ‘‘ఇరానియన్లకు ఎలాంటి అవకాశాలు లేవు. వారు ప్రపంచాన్ని అంతర్జాతీయ జలమార్గాల ద్వారా కేవలం బెదిరించగలరు. ఇవాళ వాళ్లు ప్రాణాలతో ఉన్నారంటే అది కేవలం తన చర్చల వల్లే’’ అంటూ రాసుకొచ్చారు.

వాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
శాంతి చర్చలు విజయవంతం అవుతాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్ బయల్దేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చర్చల విషయంలో ఇరాన్ సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ వాళ్లు ఏదైనా ఆటలాడితే.. మా బృందం అదేరీతిలో వ్యవహరిస్తుంది అని అన్నారు.
ఘలీబాఫ్ పోస్ట్
చర్చలకు ముందు ఇరాన్ డిమాండ్లను ప్రస్తావిస్తూ.. పార్లమెంట్ స్పీకర్, చర్చల ప్రతినిధి అయిన మొహమ్మద్ బాఘేర్ ఘలీబాఫ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. లెబనాన్లో కాల్పుల విరమణ, ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తుల విడుదల అనే రెండు అంశాలు పరస్పర అంగీకారానికి వచ్చినప్పటికీ ఇంకా అమలు కాలేదని,, ఈ రెండు విషయాలు చర్చలు ప్రారంభం కావడానికి ముందు అమలు కావాలి అని పేర్కొన్నారు.
Two of the measures mutually agreed upon between the parties have yet to be implemented: a ceasefire in Lebanon and the release of Iran’s blocked assets prior to the commencement of negotiations.
These two matters must be fulfilled before negotiations begin.— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) April 10, 2026


